
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)ను న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది. రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా... 'రిజర్వ్ డే' కారణంగా ఉత్కంఠభరితంగా మారిపోయిన ఫైనల్లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. పిచ్ను పట్టించుకోకుండా తుది జట్టు ఎంపికలో చేసిన పొరపాటు టీమిండియా ఓటమికి ఒక కారణం కాగా, కివీస్ పట్టుదల ముందు కోహ్లీసేన తలవంచింది. 2000లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ గెలిచిన న్యూజిలాండ్ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవగా... నాటి తరహాలో ఈసారి కూడా భారత్నే ఆ జట్టు ఫైనల్లో ఓడించడం విశేషం. అయితే ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.
అసలు టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రవిశాస్త్రిని తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కోచ్గా శాస్త్రి జట్టుకు చేసిందేం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేసినా వేయకున్నా ఈ తాగుబోతు రవిశాస్త్రిని మాత్రం తప్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ముఖ్యంగా మ్యాచ్ ఓడిపోతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో శాస్త్రి తాపీగా ఏదో ఆహారం తింటుండటం టీవీ కెమెరాల్లో కనిపించింది. ఇది అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దానికి సంబంధించిన ఫొటో స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ అభిమానులు పరుషపదజాలంతో ట్రోల్ చేస్తున్నారు. ఈ మనిషి వల్ల దేశ క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారని కామెంట్ చేస్తున్నారు.
ఇంకొందరు మాత్రం ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. మ్యాచ్ జరుగుతుండగా రవి శాస్త్రి నిద్రపోయిన ఫొటోలతో 'రవి అంకుల్ లే.. బార్కి పోదాం.. అప్పుడే తాగేసా ఇంక బార్ ఎందుకు?'అనే క్యాప్షన్లతో నవ్వులు పూయిస్తున్నారు. ఇంకొందరైతే డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత రవి శాస్త్రి పారిపోయి.. ముంబై ట్రైన్లో కనిపించాడని, అతని పోలీ ఉన్న మరో వ్యక్తి ఫొటోను పంచుకుంటున్నారు. ప్రస్తుతం రవిశాస్త్రిపై పేలుతున్న మీమ్స్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
ఓవర్నైట్ స్కోరు 64/2తో బుధవారం ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (88 బంతుల్లో 41; 4 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో దెబ్బ తీశాడు. అనంతరం మిగిలిన 53 కనీస ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 52 నాటౌట్; 8 ఫోర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు) మూడో వికెట్కు 96 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. మ్యాచ్లో 7 వికెట్లు తీసిన జేమీసన్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.