సౌతాఫ్రికాతో ఘోర పరాజయం అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్లో భారత్ స్థానం దిగజారింది. దాయాదీ పాకిస్థాన్ కంటే భారత్ స్థానం కిందకు పడిపోయింది. సౌతాఫ్రికాతో బుధవారం ముగిసిన రెండో టెస్ట్లో రిషభ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఘోర పరాజయంతో రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది.
93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇది మూడో క్లీన్ స్వీప్ కాగా.. వరుసగా రెండోది. ఈ రెండు పరాజయాలు కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలోనే ఎదురు కావడం భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన రేకెత్తిస్తోంది. తాజా పరాజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో టీమిండియా ఏకంగా ఐదో స్థానానికి పడిపోయింది. శత్రు దేశం పాకిస్థాన్ భారత్ కంటే ముందు నిలవడం చూసి అభిమానులు జీర్ణించుకోలేకపోతునన్నారు.
ఇంగ్లండ్ పర్యటనతో డబ్ల్యూటీసీ 2027 సైకిల్ ప్రారంభించిన భారత్ ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడింది. ఇందులో నాలుగు గెలిచి మరో నాలుగు మ్యాచ్ల్లో ఓడింది. మరో మ్యాచ్ను డ్రా చేసుకుంది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక, పాకిస్థాన్ భారత్ కంటే ముందున్నాయి.

గత రెండేళ్లలో సొంతగడ్డపై భారత టెస్ట్ టీమ్కు ఇది రెండో వైట్వాష్. గతేడాది ఇదే సమయంలో భారత్ 0-3తో న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్ అయ్యింది. ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ బెర్త్ను దక్కించుకోలేకపోయింది. అప్పుడు కూడా స్పిన్ పిచ్లపై భారత బ్యాటర్లు విఫలమై మూల్యం చెల్లించుకున్నారు. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఓడిపోగా.. సీనియర్ ఆటగాళ్లు అయిన రవిచంద్రన్ అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికారు.
టెస్ట్ టీమ్ పగ్గాలు అందుకున్న శుభ్మన్ గిల్.. ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన కనబర్చి ఐదు టెస్ట్ల సిరీస్ను 2-2తో సమం చేశాడు. కానీ తాజా సిరీస్కు అతను గాయంతో దూరం కాగా.. టీమిండియా మునపటి ఫలితాన్నే రిపీట్ చేసింది. ఈ సిరీస్ తర్వాత టీమిండియాకు టెస్ట్ల్లో సుదీర్ఘ విరామం దొరకనుంది. వచ్చే ఏడాది అఫ్గానిస్థాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనున్న భారత్.. మళ్లీ 2027లోనూ టెస్ట్ సిరీస్లు ఆడనుంది.

ఈ సుదీర్ఘ విరామాన్ని టీమిండియా టెస్ట్ టీమ్ బలోపేతానికి ఉపయోగించుకోవాలనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సొంతగడ్డపై పిచ్ల తయారి విధానంపై పునరాలోచన చేయాల్సి ఉంది. 2027లో సొంతగడ్డపై టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆ లోపు టీమిండియా స్పెషలిస్ట్ టెస్ట్ బ్యాటర్లను తయారు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.