హోమ్ టెస్ట్ సీజన్ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్ట్లో సమష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్, 140 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో రెండు టెస్ట్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 286 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 45.1 ఓవర్లలో 146 పరుగులు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
అలిక్ అథనాజే (74 బంతుల్లో 3 ఫోర్లతో 38), జస్టిన్ గ్రీవ్స్(52 బంతుల్లో 4 ఫోర్లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(3/31) మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా(4/54) నాలుగు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్(2/23)కు రెండు వికెట్లు.. వాషింగ్టన్ సుందర్కు ఒక వికెట్ దక్కింది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో వెస్టిండీస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్(48 బంతుల్లో 4 ఫోర్లతో 32), షైహోప్(36 బంతుల్లో 3 ఫోర్లతో 26), రోస్టన్ ఛేజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్కు ఒక వికెట్ దక్కింది.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 128 ఓవర్లలో 448/5 పరుగులకు డిక్లెర్ చేసింది. కేఎల్ రాహుల్(197 బంతుల్లో 12 ఫోర్లతో 100), ధ్రువ్ జురెల్(210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 125, రవీంద్ర జడేజా(176 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 104 నాటౌట్) సెంచరీలతో సత్తా చాటగా.. కెప్టెన్ శుభ్మన్ గిల్(100 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్(2/90) రెండు వికెట్లు తీయగా.. జైడన్ సీల్స్, వారికన్, పిర్ తలో వికెట్ తీసారు.