ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా దుమ్మురేపుతోంది. వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసింది. గ్రూప్-ఏలో భాగంగా ఒమన్తో శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో గ్రూప్-ఏ టాపర్గా టీమిండియా సగర్వంగా సూపర్-4కు చేరింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26), తిలక్ వర్మ(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 29) దూకుడుగా ఆడారు. ఒమన్ బౌలర్లలో షా ఫైసల్(2/23), జితేన్(2/33), అమీర్ కలీమ్(2/31) రెండేసి వికెట్లు తీసారు.

అనంతరం ఒమన్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఒమన్ బ్యాటర్లలో అమీర్ కలీమ్(46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 64), హమ్మద్ మిర్జా(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ జతిందర్ సింగ్(33 బంతుల్లో 5 ఫోర్లతో 32) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్ను టీమిండియా పూర్తిగా సన్నాహకంగా ఉపయోగించుకుంది. అందరికి బ్యాటింగ్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ ఇచ్చింది.
ఈ మ్యాచ్లో ఒమన్ ఓడినా.. తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చింది. బౌలింగ్లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో పాటు బ్యాటింగ్లో భారత బౌలర్లను చెడుగుడు ఆడింది. కీలక భాగస్వామ్యాలతో భారత్ను ఓడించే దిశగా సాగింది. కానీ చివర్లో భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఘోర పరాభావం తప్పింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఏకపక్ష విజయాలు అందుకున్న భారత్.. ఈ మ్యాచ్లో మాత్రం కాస్త కష్టంగానే విజయాన్నందుకుంది.