ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా సరికొత్త రికార్డ్ను నమోదు చేసింది. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఐదుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లతో బరిలోకి దిగింది. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా బుధవారం మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగింది. వరుసగా నాలుగో టెస్ట్లోనూ శుభ్మన్ గిల్ టాస్ గెలవలేదు.
ఈ మ్యాచ్కు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. వరుసగా మూడు టెస్ట్ల్లో విఫలమైన కరుణ్ నాయర్పై వేటు వేసిన టీమిండియా.. సాయి సుదర్శన్ను జట్టులోకి తీసుకుంది. గాయాలతో జట్టుకు దూరమైన ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి స్థానాలను అన్షూల్ కంబోజ్, శార్డూల్ ఠాకూర్లతో భర్తీ చేసింది. దాంతో టీమిండియా సరికొత్త చరిత్రను లిఖించింది.

93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 592 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఇందులో ఒక్క మ్యాచ్లో కూడా భారత్ ఐదుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లతో బరిలోకి దిగలేదు. ఇప్పటి వరకు భారత్ గరిష్టంగా నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లతోనే ఆడింది. తాజా మ్యాచ్లో మాత్రం యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఐదుగురు లెఫ్టార్మ్ బ్యాటర్లతో బరిలోకి దిగింది.
కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ బరిలోకి దిగడంతో టీమిండియా ఈ ఫీట్ సాధించింది. లార్డ్స్ టెస్ట్లో గాయపడిన రిషభ్ పంత్.. ఈ మ్యాచ్కు దూరంగా ఉంటాడని ప్రచారం జరిగినా అతను పూర్తి ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగాడు. ఈ సిరీస్లో రిషభ్ పంత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. 6 ఇన్నింగ్స్ల్లో 425 పరుగులు చేశాడు. తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్ల్లో పంత్ శతకాలు(134, 118) బాదాడు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. 120 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(98 బంతుల్లో 4 ఫోర్లతో 46), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 58) శుభారంభం అందించి వెనుదిరిగారు. క్రిస్ వోక్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ ఔటవ్వగా.. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన యశస్వి జైస్వాల్ను లియామ్ డాసన్ పెవిలియన్ చేర్చాడు. 8 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టెస్ట్ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన డాసన్.. తాను వేసిన రెండో ఓవర్ తొలి బంతికే వికెట్ తీసాడు. ప్రస్తుతం క్రీజులో శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ ఉన్నారు.