India creates history in T20Is: టీ20 క్రికెట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డ్ అందుకుంది. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో 20 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఈ అరుదైన ఫీట్ సాధించింది.
ఈ క్రమంలో పాకిస్థాన్ రికార్డ్ను బద్దలు కొట్టింది. 135 విజయాలతో ఈ జాబితాలో పాకిస్థాన్ అగ్రస్థానంలో ఉండగా 136 విజయాలతో టీమిండియా వెనక్కినెట్టింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన జట్టుగానూ భారత్ చరిత్రకెక్కింది. 213 మ్యాచ్ల్లో టీమిండియా 136 విజయాలు సాధించి 67 మ్యాచ్ల్లో ఓడింది. మరో 6 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు.

పాకిస్థాన్ 226 మ్యాచ్ల్లో 135 మ్యాచ్ల్లో విజయం సాధించి 82 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. భారత్, పాకిస్థాన్ తర్వాత ఈ జాబితాలో న్యూజిలాండ్(200 మ్యాచ్ల్లో 102 విజయాలు), సౌతాఫ్రికా (171 మ్యాచ్ల్లో 95), ఆస్ట్రేలియా( 181 మ్యాచ్ల్లో 95), ఇంగ్లండ్( 177 మ్యాచ్ల్లో 92) కొనసాగుతున్నాయి.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. జితేశ్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 46), యశస్వీ జైస్వాల్(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 37), రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32) పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్(3/40) మూడు వికెట్లు తీయగా.. జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీకి ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(16 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31), మాథ్యూ వేడ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది.
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అక్షర్ పటేల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 ఆదివారం బెంగళూరు వేదికగా జరగనుంది.