భారత స్వ్కాష్ మిక్స్డ్ టీమ్ చరిత్ర సృష్టించింది. తొలి ప్రపంచకప్ టైటిల్ను ముద్దాడింది. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో టాప్ సీడ్ హాంకాంగ్ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. స్క్వాష్ ప్రపంచకప్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా చరిత్రకెక్కింది.
2023లో కాంస్యం నెగ్గిన తర్వాత స్క్వాష్ క్రీడలో టీమిండియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. టోర్నీ మొత్తం ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ఓటమెరుగని జట్టుగా ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఈజిప్టు తర్వాత ఈ టైటిల్ నెగ్గిన జట్టుగా టీమిండియా నిలిచింది.
ఫైనల్లో సీనియర్ ప్లేయర్ జోష్న చినప్ప, అభయ్ సింగ్, 17 ఏళ్ల సెన్సేషన్ అనాహత్ సింగ్ కళ్లు చెదిరే ప్రదర్శనతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫైనల్లో ముందుగా పురుషుల సింగిల్స్ మ్యాచ్ జరగ్గా అభయ్ సింగ్ 3-0 (7-1, 7-4, 7-4)తో హాంగ్ కాంగ్ అలెక్స్ లౌను ఓడించాడు. వరుసగా మూడు సెట్లను కైవసం చేసుకున్నాడు.

ఆ తర్వాత జరిగిన మహిళల సింగిల్స్ 1లో 17 ఏళ్ల అనహత్ సింగ్ 3-0 (7-2, 7-2, 7-5)తేడాతో టొమాటో హోను ఓడించింది. మహిళల సింగిల్స్ రెండో మ్యాచ్లో జోష్న చినప్ప 3-1(7-3, 2-7, 7-5, 7-1) తేడాతో తన కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన కాయిలీని ఓడించింది. ఈ అద్భుత ప్రదర్శనతోస్వర్ణ పతకాన్ని ఖాయం చేసింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాపై 3-0తో విజయ సాధించిన భారత్.. సెమీ-ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఈజిప్ట్ను కూడా 3-0 తేడాతో మట్టికరిపించింది.