టీ20 ఫార్మాట్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమిండియా బుధవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించి 23 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది. టీ20ల్లో టీమిండియాకు ఇది 150వ విజయం. పొట్టి ఫార్మాట్లో 150 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్రకెక్కింది.

జింబాబ్వేతో మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. డియోన్ మైర్స్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 65 నాటౌట్), క్లైవ్ మదండే(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/15) వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్(1/15) ఓ వికెట్ తీసాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 230 మ్యాచ్లు ఆడిన టీమిండియా.. 150 మ్యాచ్ల్లో గెలుపొంది అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భారత్ తర్వాత పాకిస్థాన్ 142 విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు:
భారత్-230 మ్యాచ్ల్లో 150 విజయాలు
పాకిస్థాన్-245 మ్యాచ్ల్లో 142 విజయాలు
న్యూజిలాండ్-220 మ్యాచ్ల్లో 111 విజయాలు
ఆస్ట్రేలియా-195 మ్యాచ్ల్లో 105 విజయాలు
సౌతాఫ్రికా-185 మ్యాచ్లో 104 విజయాలు