ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్లో టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరాశపర్చారు. మూడో రోజు ఆట తొలి సెషన్లో ఒక్క వికెట్ తీయలేకపోయారు. ముఖ్యంగా భారత పేసర్లు తేలిపోయారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, అరంగేట్ర పేసర్ అన్షుల్ కంబోజ్, పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ తీవ్రంగా నిరాశపర్చారు. వికెట్లు తీయడం దేవుడెరుగు.. ఇంగ్లండ్ బాజ్ బాల్ బ్యాటింగ్కు బ్రేక్ వేయలేక ధారళంగా పరుగులిచ్చుకున్నారు. దాంతో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. ఓవర్సీస్ కండిషన్స్లో గత 10 ఏళ్లలో తొలిసారి 500 ప్లస్ రన్స్ను సమర్పించుకుంది.
2015లో చివరిసారిగా టీమిండియా ఓవర్సీస్ కండిషన్స్లో 500 ప్లస్ రన్స్ ఇచ్చింది. సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 572 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఎప్పుడూ 500 ప్లస్ రన్స్ ఇచ్చుకోలేదు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న తాజా మ్యాచ్లోనే 500 ప్లస్ రన్స్ ఇచ్చుకొని చెత్త రికార్డ్ నమోదు చేసింది.

రూట్(248 బంతుల్లో 14 ఫోర్లతో 150) భారీ శతకంతో పాటు ఓలీ పోప్(128 బంతుల్లో 7 ఫోర్లతో 71), బెన్ స్టోక్స్(123 బంతుల్లో 6 ఫోర్లతో 70 నాటౌట్) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 135 ఓవర్లలో 7 వికెట్లకు 544 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్, బమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ పడగొట్టారు.ఇంగ్లండ్ ఆధిక్యం ఇప్పటికే 186 పరుగులు చేరింది. తొలి సెషన్లోనే ఓలీ పోప్, బెన్ స్టోక్స్ సూపర్ బ్యాటింగ్తో 100 ప్లస్ రన్స్ రాబట్టారు. ఆశ్చర్యకరంగా కొత్త బంతితో భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయవకాశాలు సన్నగిల్లాయి. డ్రా చేసుకోవడం మినహా భారత జట్టు ముందు మరో ఆప్షన్ లేదు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(75 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 54), యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 58), సాయి సుదర్శన్(151 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, లియామ్ డాసన్ చెరో వికెట్ తీసారు.