టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ అండగా నిలిచాడు. కొందరు అతని ఎదుగుదలను ఓర్వలేకనే గంభీర్పై విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపాడు. కోల్కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా ఓటమిపాలైంది. పూర్తిగా స్పిన్కు అనుకూలంగా ఉన్న వికెట్పై భారత బ్యాటర్లు బంతిని డిఫెండ్ చేయలేకపోయారు. దాంతో పిచ్ క్యురేటర్పై విమర్శలు వచ్చాయి.
అయితే క్యురేటర్ తప్పిదం లేదని, తాము కోరిన పిచ్నే ఇచ్చాడని మ్యాచ్ అనంతరం గంభీర్ స్పష్టం చేశాడు. తమ బ్యాటర్లే పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడలేకపోయారని తెలిపాడు. దాంతో గంభీర్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గంభీర్ అనాలోచిత నిర్ణయాల కారణంగానే టీమిండియా ఓటమిపాలైందనే అభిప్రాయం వ్యక్తమైంది. గౌహతి వేదికగా శనివారం నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుండగా.. బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా గంభీర్పై వచ్చిన విమర్శలను తిప్పి కొట్టిన సితాన్షు కోటక్.. కొందరు పనిగట్టుకొని తమ హెడ్ కోచ్పై విమర్శలు గుప్పిస్తున్నారని అభిప్రాయపడ్డాడు.

'క్యురేటర్పై విమర్శలు రావద్దనే గౌతమ్ గంభీర్ ఆ నిందను తనపై వేసుకున్నాడు. ఇతర దేశాలు కూడా వారి సొంతగడ్డపై తమ బలాలకు అనుగుణంగా ఉండే పిచ్లనే తయారు చేసుకుంటాయి. మేం కూడా సొంతగడ్డపై ఆడేటప్పుడు స్పిన్ పిచ్లపై ఆధారపడుతాం. స్పిన్నర్లకు కొంత సాయం లభించేలా నాలుగు, నాలుగున్నర రోజుల పాటు ఆట సాగే పిచ్లను ఆశిస్తాం. తొలి రెండు రోజులు పేసర్లకు సహకరించే పిచ్లను కోరుకుంటాం.
తొలి టెస్ట్ పరాజయం అనంతరం జనాలు కేవలం గౌతమ్ గంభీర్ గురించే మాట్లాడుతున్నారు. బ్యాటర్ల వైఫల్యం గురించి కానీ బ్యాటింగ్ కోచ్ పనితీరును కానీ ప్రస్తావించడం లేదు. భారత్ ఓడిన ప్రతీసారి గంభీర్పైనే విమర్శలు వస్తున్నాయి. బహుషా గంభీర్ పట్ల కొంతమందికి వారి సొంత ఎజెండాలు ఉండవచ్చు. పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు. ఇది చాలా తప్పు.
కోల్కతా వంటి పిచ్లపై రాణించాలంటే బ్యాటర్ల ఫుట్వర్క్ బాగుండాలి. బౌలర్లు లెంగ్త్ను సరిగ్గా అంచనా వేయగలిగితే ఎలాంటి పిచ్పై అయినా రాణించగలరు. మరీ డిఫెన్స్ ఆడితే కూడా ఔటయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బౌలర్లు స్థిరమైన ప్రదేశాల్లో బౌలింగ్ చేస్తూనే ఉంటారు. మేం మ్యాచ్కు ముందు కొన్ని విషయాలను మాత్రమే చర్చించగలం. ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాలి. మరొకరు బిజీ క్రికెట్ ఆడాలని మాత్రమే మాట్లాడుకుంటాం.'అని సితాన్షు కోటక్ చెప్పుకొచ్చాడు.