టీమ్ కాంబినేషన్లో భాగంగానే శుభ్మన్ గిల్ను తుది జట్టు నుంచి తప్పించామని టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తెలిపాడు. ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా గురువారం మెల్ బోర్న్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్ట్కు శుభ్మన్ గిల్ దూరమయ్యాడు.
అతని స్థాన్ంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్కు అవకాశం కల్పించారు. శుభ్మన్ గిల్ను తుది జట్టు నుంచి తప్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ టీమిండియా మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పించారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో 86 ఓవర్లలో 6 వికెట్లకు 311 పరుగుల భారీ స్కోర్ చేసింది.

అరంగేట్ర ప్లేయర్ సామ్ కోన్స్టాస్(65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 60), ఉస్మాన్ ఖవాజా(121 బంతుల్లో 6 ఫోర్లతో 57), మార్నస్ లబుషేన్(145 బంతుల్లో 7 ఫోర్లతో 72), స్టీవ్ స్మిత్(111 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 68 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా .. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.
తొలి రోజు ఆట అనంతరం టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా శుభ్మన్ గిల్ను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించాడు. 'పిచ్ను చూసిన తర్వాత వాషింగ్టన్ సుందర్ జట్టుకు అవసరమని భావించాం. జడేజాతో కలిసి సుందర్ కీలక పాత్ర పోషిస్తాడనుకున్నాం.
శుభ్మన్ గిల్ను తప్పించడం మాకు బాధగానే ఉంది. కానీ ఈ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అతనిపై వేటు వేయలేదు. టీమ్కాంబినేషన్లో సెట్ అవ్వలేదు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగుతాడు.'అని తెలిపాడు. రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగితే కేఎల్ రాహుల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేయనున్నాడు.
శుభ్మన్ గిల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ 12 ఓవర్లు బౌలింగ్ చేసి ఓ వికెట్ తీసాడు. సెంచరీ దిశగా సాగుతున్న మార్నస్ లబుషేన్ను పెవిలియన్ చేర్చాడు. మరోవైపు జడేజా 14 ఓవర్లలో 54 పరుగులిచ్చి కీలక వికెట్ పడగొట్టాడు. అదిరిపోయే బ్యాటింగ్తో ఆసీస్కు శుభారంభం ఇచ్చిన సామ్ కోన్స్టాస్ను పెవిలియన్ చేర్చాడు.