ఓవల్ పిచ్ క్యూరేట్ లీ ఫోర్టిస్తో చోటు చేసుకున్న వాగ్వాదంపై టీమిండియా స్పందించింది. లీ ఫోర్టిస్ అతిగా ప్రవర్తించడంతో హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆగ్రహానికి గురయ్యాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. పిచ్ క్యూరేటర్పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్, భారత్ మధ్య గురువారం నుంచి ఓవల్ మైదానం వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం టీమిండియా మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది.
ఈ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ పిచ్ను పరిశీలించేందుకు దగ్గరగా వెళ్లాడు. ఇది గమించిన పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్.. బ్యాటర్ మినహా మిగతావారంతా వికెట్కు 2.5 మీటర్ల దూరంలో ఉండాలని గట్టిగా చెప్పాడు. దాంతో ఆగ్రహానికి గురైన గంభీర్ పిచ్ క్యూరేటర్ను తిట్టాడు. 'ఎవనికి చెప్పుకుంటావో చెప్పుకోపో'అని అరిచాడు. గంభీర్ కోపాన్ని గమనించిన టీమిండియా సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్ పిచ్ క్యూరేటర్ను పక్కకు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

ప్రాక్టీస్ సెషన్ అనంతరం ఐదో టెస్ట్ను ఉద్దేశించి బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పిచ్ క్యూరేటర్తో చోటు చేసుకున్న వాగ్వాదంపై స్పందించాడు. గొడవకు గల కారణాన్ని తెలియజేశాడు. 'పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ హద్దులు ధాటి ప్రవర్తించాడు. పిచ్కు 2.5 మీటర్ల దూరంలో నిల్చోండని, రోప్ బయటకు వెళ్లండని హెడ్ కోచ్కు గ్రౌండ్ సిబ్బంది చెప్పడం ఇప్పటి వరకు నేను చూడలేదు.
ఇది ఏ మాత్రం సరికాదు. అందుకే గంభీర్ ఆగ్రహానికి గురయ్యాడు. అయితే ఈ ఘటనపై టీమిండియా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. సరే.. పిచ్ పాడవుతుందని అలా చెప్పాడనుకుంటే అసలు మా జట్టు సభ్యులెవరూ స్పైక్స్ ధరించలేదు. మా వల్ల పిచ్కు ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదు. కానీ లీ ఫోర్టిస్ అతిగా ప్రవర్తించాడు.'అని కోటక్ సితాన్సు వివరించాడు.