న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో సమష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో వన్డేల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న టీమిండియా.. అరుదైన ఫీట్ సాధించింది.
వన్డే ర్యాంకింగ్స్లో 116 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా.. టెస్ట్లు 118 పాయింట్లతో.. టీ20ల్లో 264 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతోంది. వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా టాప్లో ఉండగా.. పాకిస్థాన్(115), ఆస్ట్రేలియా(111) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ ఇంగ్లీస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబుషేన్(39) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్లకు తోడుగా.. జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా.. 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (77 బంతుల్లో 10 ఫోర్లతో 71), శుభ్మన్ గిల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 74)తో పాటు కేఎల్ రాహుల్(63 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (49 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా రెండు వికెట్లు తీయగా.., పాట్ కమిన్స్, సీన్ అబాట్ తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.