కొలంబో: భారత్-పాక్ పోరు అంటే అభిమానులకు అమితాసక్తే. అది ఏ స్థాయి టోర్నీ అయినా.. ఎక్కడైనా.. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరు జట్ల అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. అలాంటిది ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడుతున్నాయంటే అంచనాలన్నీ వేరే స్థాయిలో ఉంటాయి.
ఈ ఆసక్తికర పోరుకు ఎమర్జింగ్ ఆసియాకప్ వన్డే టోర్నీ వేదికగా నిలవనుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ యంగ్ టీమ్స్ హై ఓల్టేజ్ టైటిల్ ఫైట్కు సిద్దమయ్యాయి. మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఫైనల్లో ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్న యంగ్ ఇండియా ఈ మ్యాచ్లో ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.

లీగ్ దశలో పాకిస్థాన్ను ఓడించడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచనుంది. బంగ్లాదేశ్తో సెమీఫైనల్లో బ్యాటింగ్లో తడబడినా.. స్పిన్నర్లు నిశాంత్ సింధు, మానవ్ సుతార్ రాణించడంతో గట్టెక్కింది. అయితే ఫైనల్లో ఇలాంటి తడబాటుకు చోటిస్తే టీమిండియాకు కష్టమే.
బ్యాటింగ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన యశ్ ధూల్తో పాటు ఓపెనర్లు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉన్నారు. బౌలింగ్లో స్పిన్నర్లు నిశాంత్, మానవ్కు అండగా పేసర్లు రాజవర్థన్ హంగార్గేకర్, హర్షిత్ రాణా సత్తా చాటుతున్నారు. వీళ్లంతా సమష్టిగా ఆడితే పాకిస్థాన్ను ఓడించడం పెద్ద కష్టమేం కాదు.
ఈ టోర్నీలో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్ సెమీస్లో మాత్రం చెలరేగి ఆడింది. 322 పరుగుల భారీ స్కోర్ చేసిన ఆ జట్టు బౌలింగ్లోనూ రాణించి శ్రీలంకపై 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓమర్ యూసుఫ్, కెప్టెన్ మహమ్మద్ హారిస్, ఆల్రౌండర్ ముబాసిర్ ఖాన్.. బౌలర్లలో అర్షద్ ఇక్బాల్, సుఫియన్ ముఖీమ్ రాణిస్తున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.