టీమిండియా వెటరన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రమోషన్ ఇచ్చింది. భారత్-ఏ జట్టు కెప్టెన్గా ఎంపిక చేసింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరగనున్న రెండు అనధికారిక టెస్ట్లు ఆడే భారత్-ఏ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది.
ఈ జట్టు సారథ్య బాధ్యతలను శ్రేయస్ అయ్యర్కు అప్పగించింది. ధ్రువ్ జురెల్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. కేఎల్ రాహుల్తో పాటు మహమ్మద్ సిరాజ్ రెండో అనధికారిక టెస్ట్ ఆడుతారని పేర్కొంది. లక్నో వేదికగా సెప్టెంబర్ 16 నుంచి ఈ అనధికారిక టెస్ట్లు ప్రారంభం కానున్నాయి. 16 నుంచి 19 మధ్య తొలి అనధికారిక టెస్ట్, సెప్టెంబర్ 23 నుంచి 26 మధ్య రెండో అనధికారిక టెస్ట్ జరగనుంది.

వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్కు సన్నాహకంగా ఈ మ్యాచ్లను బీసీసీఐ ఉపయోగించనుంది. ఇందులో మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లకు వెస్టిండీస్తో సిరీస్కు అవకాశం దక్కుతుంది. టీమిండియా టెస్ట్ టీమ్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు శ్రేయస్ అయ్యర్కు ఇది సువర్ణవకాశం. ఇందులో సత్తా చాటితే అతను భారత జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 మధ్య కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో మూడు అనధికారికి వన్డేలు జరగనున్నాయి.
భారత్-ఏ జట్టు: శ్రేయస్ అయ్యర్ (C), అభిమన్యు ఈశ్వరన్, ఎన్ జగదీశన్ (WK), సాయి సుదర్శన్, ధృవ్ జురెల్ (VC & WK), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యశ్ ఠాకూర్.