ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. 23 పరుగుల లోటు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 396 పరుగుల భారీ స్కోర్ చేసింది. యశస్వి జైస్వాల్(164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్లతో 118) సెంచరీతో రాణించగా.. ఆకాష్ దీప్(94 బంతుల్లో 12 ఫోర్లతో 66), రవీంద్ర జడేజా(77 బంతుల్లో 5 ఫోర్లతో 53), వాషింగ్టన్ సుందర్(46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(5/125) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. గస్ అట్కిన్సన్(3/127) మూడు వికెట్లు పడగొట్టాడు. జెమీ ఓవర్టన్(2/98) రెండు వికెట్లు తీసాడు. చివర్లో దూకుడుగా ఆడి విలువైన హాఫ్ సెంచరీతో సుందర్ మ్యాచ్ను భారత్వైపు మలుపు తిప్పాడు. దాంతో ఇంగ్లండ్ ముందు 374 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్(34 బ్యాటింగ్) ఉండగా.. జాక్ క్రాలీ(14)ని సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్ విజయానికి 324 పరుగుల అవసరం కాగా.. మరో 8 వికెట్లు తీస్తే భారత విజయం లాంఛనమవుతోంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీ డ్రా అవుతుంది. భారత బౌలర్లపైనే విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి

75/2 ఓవర్ నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు నైట్ వాచ్మన్ ఆకాష్ దీప్, యశస్వి జైస్వాల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థవంతంగా ఆడిన ఈ జోడీ వేగంగా పరుగులు రాబట్టింది. టాపార్డర్ బ్యాటర్ తరహాలోనే ఆకాష్ దీప్.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే ఆకాష్ దీప్ 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో అతనికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. తన ఇన్నింగ్స్లో ఆకాష్ దీప్ 12 ఫోర్లు కొట్టడం గమనార్హం. సరిగ్గా లంచ్ సెషన్కు ముందు ఆకాష్ దీప్ను జెమీ ఓవర్టన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి శుభ్మన్ గిల్ రాగా.. జైస్వాల్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించాడు. దాంతో భారత్ 189/3 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.
రెండో సెషన్ ఆరంభంలోనే శుభ్మన్ గిల్ను గస్ అట్కిన్సన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. క్రీజులోకి కరుణ్ నాయర్ రాగా.. అట్కిన్సన్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ సింగిల్ తీసి 127 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కాసేపటికే కరుణ్ నాయర్(17)ను అట్కిన్సన్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. జడేజాతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జోష్ టంగ్ బౌలింగ్లో యశస్వి జైస్వాల్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్తో కలిసి జడేజా ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. దాంతో భారత్ 304/6 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
ఆఖరి సెషన్లోనూ ఈ జోడీ సాధికరింగా బ్యాటింగ్ చేసింది. ఏడో వికెట్కు 50 పరుగులు జోడించింది. అయితే ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఓవర్టన్ విడదీసాడు. ధ్రువ్ జురెల్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి సుందర్ రాగా.. జడేజా 71 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే అతనితో పాటు సిరాజ్(0)ను టంగ్ పెవిలియన్ చేర్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు వాషింగ్టన్ సుందర్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతను 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుందర్ను టంగ్ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్కు తెరపడింది.