హమిల్టన్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా గత టీమ్ను మిథాలీ రాజ్ కొనసాగించింది. ఓపెనర్లు స్మృతి మంధానా(22 బ్యాటింగ్), యస్తికా భాటియా(31) శుభారంభం అందించగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(5) తన పేలవ ఫామ్ను కొనసాగిస్తూ మళ్లీ నిరాశ పరిచింది.
మాథ్యూస్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(15 బ్యాటింగ్)తో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(22 బ్యాటింగ్) ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తోంది. 13 ఓవర్లు ముగిసే సరికి భారత అమ్మాయిలు 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేశారు.
ఇక తొలిపోరులో పాకిస్థాన్పై గెలిచి ఆత్మవిశ్వాసంతో రెండో మ్యాచ్లో బరిలోకి దిగిన మిథాలీ సేనకు చుక్కెదురైంది. తొలిసారి ప్రపంచకప్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్న భారత జట్టు ఆతిథ్య న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడంతో అభిమానులు నిరాశలో మునిగారు. భారత జట్టులో ప్రధానంగా బ్యాటింగ్ సమస్య తలెత్తుతోంది.
మరోవైపు వెస్టిండీస్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ గత మ్యాచ్లో విండీస్ అమ్మాయిలు అద్భుత విజయాన్నందుకున్నారు. గత మ్యాచ్లోనే స్టార్ ఓపెనర్ షెఫాలీ వర్మను టీమ్మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. బిగ్ హిట్టర్స్ కలిగిన విండీస్ టీమ్కు భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలి. లేకుంటే ఈ మ్యాచ్లో మిథాలీ సేన గెలవడం కష్టం.
భారత జట్టు:
యాస్తికా బాటియా, స్మృతి మందాన, దీప్తి శర్మ, మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, స్నేహ్ రానా, పూజా వస్త్రాకర్, జూలన్ గోస్వామి, మేఘ్నా సింగ్, రాజేశ్వరీ గైక్వాడ్