హమిల్టన్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆతిథ్య న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ జట్టును చిత్తు చేసి టోర్నీలో ఘన ఆరంభాన్ని అందుకున్న మిథాలీ సేన.. తమ రెండో మ్యాచ్లో పటిష్టమైన న్యూజిలాండ్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేస్తున్నారు.
సూపర్ ఫీల్డింగ్తో న్యూజిలాండ్ ఓపెనర్ సూజి బెట్స్(5)ను ఔట్ చేసిన భారత అమ్మాయిలు.. క్రీజులో కుదురుకున్న కెప్టెన్ సోఫీ డివైన్(35), ఫస్ట్ డౌన్ బ్యాటర్ అమెలియా కెర్(64 బంతుల్లో 5 ఫోర్లతో 50) పెవిలియన్ చేర్చారు. కెప్టెన్ సోఫీ డివైన్ను పూజా వస్త్రాకర్ కీపర్ క్యాచ్గా ఔట్ చేయగా.. హాఫ్ సెంచరీ బాదిన అమెలియా కెర్ను రాజేశ్వరీ గైక్వాడ్ ఎల్బీగా వెనక్కిపంపింది. 26 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు న్యూజిలాండ్ 139 పరుగులు చేసింది. క్రీజులో అమీ సట్టర్వైట్(32 బ్యాటింగ్), మ్యాడ్డీ గ్రీన్(10 బ్యాటింగ్) ఉన్నారు.
ఇక ప్రపంచకప్కు ముందు ఐదు వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ జట్టు భారత్ను 4-1 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్థాన్తో జరిగిన పోరులో మ్యాచ్లో భారత్ 114 పరుగులకే కీలక 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినప్పటికీ ప్రత్యర్థి ఎదుట 244 పరుగులు చేసింది. అనంతరం పాక్ను 137 పరుగులకే ఆలౌట్చేసింది. దీంతో భారత్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.
భారత జట్టు: స్మృతి మంధాన, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్, రిచా ఘోష్(కీపర్), స్నేహ్ రాణా, పూజ వస్త్రాకర్, జులన్ గోస్వామి, మేఘన సింగ్, రాజేశ్వరి గైక్వాడ్