
హమిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా టాపార్డర్ మరోసారి తడబడింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకుంటే తప్పనిసరి గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత టాప్ బ్యాటర్లు చేతులెత్తేసారు. ఓపెనర్లు స్మృతి మంధానా(30), షెఫాలీ వర్మ(42) శుభారంభం అందించినా.. దానిని మిగతా బ్యాటర్లు అందుకోలేకపోయారు. గత మ్యాచ్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన కెప్టెన్ మిథాలీ రాజ్(0), సీనియర్ బ్యాటర్ హర్మన్ ప్రీత్ కౌర్(14) తీవ్రంగా నిరాశపరిచారు. వరుసగా మూడు బంతుల్లో భారత బ్యాటర్లు పెవిలియన్ చేరడం గమనార్హం.
తొలి వికెట్కు 74 పరుగులు జోడించిన అనంతరం స్మృతి మంధాన నహిదా అక్తెర్ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్గా వెనుదిరగ్గా.. రితు మోని వేసిన మరుసటి ఓవర్లో వరుసగా రెండు బంతుల్లో షెఫాలీ వర్మ, మిథాలీ రాజ్ ఔటయ్యారు. మిథాలీ గోల్డెన్ డక్ కావడం గమనార్హం. దాంతో భారత్ 74 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన యస్తికా భాటియా, హర్మన్ ప్రీత్ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ సమన్వయ లోపం కారణంగా హర్మన్ ప్రీత్ రనౌట్గా వెనుదిరిగింది. దాంతో 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్(10 బ్యాటింగ్)తో యస్తిక(25 బ్యాటింగ్) పోరాడుతోంది. 31 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్లకు 126 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు భారత్కు ఎంతో కీలకం. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ల్లో భారత్ రెండు గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో తప్పకుండా గెలిస్తేనే మిథాలీసేనకు సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఆస్ట్రేలియాతో గత మ్యాచ్లో ఓటమి పాలవ్వడం భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఈమ్యాచ్తో పాటు సౌతాఫ్రికాతో జరిగే తదుపరి మ్యాచ్ను మెరుగైన రన్రేట్తో టీమిండియా గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.
భారతజట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, మిథాలీ రాజ్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, స్నేహ్ రానా, పూజా వస్త్రాకర్, జూలన్ గోస్వామి, రాజేశ్ గైక్వాడ్, పూనమ్ యాదవ్