|
అసలేం జరిగిందంటే..
భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఆస్ట్రేలియా బౌలర్ సోని మోలినెక్స్ వేసిన 90వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పూనమ్ వ్యక్తిగత స్కోర్ 36 పరుగుల వద్దగా ఉండగా.. సోనీ వేసిన బంతి ఆమె బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలో పడింది. ఆస్ట్రేలియా ప్లేయర్స్ గట్టిగా అప్పీల్ చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు.
కానీ బ్యాల్ బ్యాట్కు టచ్ అయిందని తెలిసి పూనమ్ రౌత్ అంపైర్ నిర్ణయం పట్టించుకోకుండానే మైదానాన్ని వీడింది. ఆమె చూపెట్టిన క్రీడాస్పూర్తికి ఆస్ట్రేలియా ప్లేయర్లతో పాటు భారత ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఇక పూనమే స్వయంగా ఔటని ఒప్పకోవడంతో ఆసీస్ ప్లేయర్స్ డీఆర్ఎస్ కోరలేదు.
చెలరేగిన స్మృతి మంధాన..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళలు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. స్మృతి మంధాన(216 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్తో 127) సెంచరీతో చెలరేగగా.. షెఫాలీ వర్మ(31), పూనమ్ రౌత్(36), మిథాలీ రాజ్(30) రాణించారు. ప్రస్తుతం క్రీజులో దీప్తి శర్మ(12 బ్యాటింగ్), తానియా భాటియా(0 బ్యాటింగ్) ఉన్నారు.
ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా స్మృతి మంధాన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పింక్ టెస్ట్లో ఫస్ట్ సెంచరీ చేసిన భారత మహిళగా.. రెండో భారత క్రికెటర్గా గుర్తింపు పొందింది. పురుషుల క్రికెట్లో విరాట్ కోహ్లీ ముందుగా ఈ ఘనతను అందుకున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన పింక్ ఫస్ట్ టెస్ట్లో విరాట్ సెంచరీ బాదాడు.
ఆఫ్ సైడ్ క్వీన్గా..
ఆఫ్ సైడ్లో భారీ షాట్లు కొట్టిన మంధాన.. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బౌండరీల వర్షం కురిపించింది. గులాబి బంతితో ఆడడం ఇదే తొలిసారి అయినా గొప్ప పోరాట పటిమను ప్రదర్శించింది. మొదటి రోజు వర్షం అంతరాయం కలిగించినా.. పట్టుదలతో క్రీజులో నిలిచి టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చింది. భారత్ ఇప్పటివరకు పింక్ బాల్తో ఆడిన సందర్భాలు లేవు. అందులోనూ ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్టుతో ఆడటం పెద్ద సవాలు. వీటిని అదిగమించి స్మృతి మంధాన అద్భుతంగా రాణించి సెంచరీ చేసింది. భారత్ తరఫున డే అండ్ నైట్ టెస్టులో ముందుగా సెంచరీ చేసింది విరాట్ కోహ్లీ. 2019లో బంగ్లాపై విరాట్ శతకం బాదాడు.
15 ఏళ్ల తర్వాత..
చివరిసారిగా 2006లో భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. కెప్టెన్ మిథాలీ రాజ్, వెటరన్ పేసర్ జులన్ గోస్వామి అప్పటి మ్యాచ్ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే. భారత్కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో భారత్ చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది.
ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్ సిరీస్ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్టులు జరిగాయి. ఆస్ట్రేలియా 5 టెస్టుల్లో గెలుపొందగా.. నాలుగు డ్రాగా ముగిశాయి. భారత్ ఒక్క మ్యాచ్లోనూ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.