
గోల్డ్కోస్ట్: భారత్-ఆస్ట్రేలియా మహిళల మధ్య 15 ఏళ్ల తర్వాత జరిగిన ఏకైక డే/నైట్ టెస్ట్ డ్రాగా ముగిసింది. అయితే డ్రాగా ముగిసినా.. ఈ పింక్ బాల్ టెస్ట్లో బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన భారత అమ్మాయిల కంగారూ జట్టును కంగారు పెట్టారు. చివరి రోజైన ఆదివారం ఆట అనేక మలుపులు తిరిగింది. ఓవర్నైట్ స్కోరు 143/4తో ఆఖరి, నాలుగో రోజైన ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో 98 రన్స్ జోడించి 241/9 వద్ద డిక్లేర్ చేసింది. ఎలిస్ పెర్రీ (68 నాటౌట్), యాష్లే గార్డ్నర్ (51) అర్ధ సెంచరీలు సాధించారు. పూజా వస్ర్తాకర్ 3 వికెట్లు పడగొట్టగా.. జులన్ గోస్వామి, మేఘా సింగ్, దీప్తీ శర్మ తలో రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం వేగంగా ఆడిన టీమిండియా టీ విరామం తర్వాత రెండో ఇన్నింగ్స్ను 135/3 వద్ద డిక్లేర్ చేసింది. షెఫాలీ వర్మ (52) అర్ధ సెంచరీతో పాటు పూనమ్ రౌత్ (41 నాటౌట్), స్మృతి మంధాన (31) రాణించారు. ఇక చివరి సెషన్లో కంగారూలు 32 ఓవర్లలో 272 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగారు. అయితే ఆసీస్ 15 ఓవర్లలో 36/2 స్కోరు వద్ద ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. ఓపెనర్ల వికెట్లను భారత్ త్వరగానే తీసినప్పటికీ లానింగ్ (17 నాటౌట్) క్రీజులో పాతుకుపోవడంతో డ్రా తప్పలేదు. వర్షం కారణంగా తొలి రెండు రోజుల్లో కలిపి 80 ఓవర్లకు పైగా ఆట సాధ్యపడలేదు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ 377/8 (డిక్లేర్డ్) స్కోరు చేసింది. స్మృతి మంధాన 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 377/8 డిక్లేర్డ్;
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 241/9 డిక్లేర్డ్ (ఎలిస్ పెర్రీ 68 నాటౌట్, గార్డ్నర్ 51; పూజా వస్ర్తాకర్ 3/49, గోస్వామి 2/33, మేఘా సింగ్ 2/54, దీప్తీ శర్మ 2/36);
భారత్ రెండో ఇన్నింగ్స్: 135/3 డిక్లేర్డ్ (షఫాలీ వర్మ 52, పూనమ్ రౌత్ 41 నాటౌట్, మంధాన 31);
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 36/2 (మెగ్ లానింగ్ 17 నాటౌట్, బేత్ మూనీ 11)