ముంబై: సొంతగడ్డపై ఆస్ట్రేలియా మహిళలతో ఐదు టీ20ల సిరీస్ను భారత మహిళలు ఓటమితో ప్రారంభించారు. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ(57 బంతుల్లో 16 ఫోర్లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో భారత ఓటమిని శాసించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది.
భారత టాపార్డర్ బ్యాటర్లు ఫెఫాలీ వర్మ(10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 21), స్మృతి మంధానా(22 బంతుల్లో 5 ఫోర్లతో 28), జెమీమా రోడ్రిగ్స్(0) విఫలమైనా.. ఫినిషింగ్ బ్యాటర్ల దీప్తి శర్మ(15 బంతుల్లో 8 ఫోర్లతో 36), రిచా ఘోష్(20 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స్లతో 36) ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగారు. దాంతో భారత్ ఆసీస్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బౌలర్లలో ఎల్లిస్ పెర్రీ రెండు వికెట్లు తీయగా.. అశ్లీ గార్డెనర్, సుదెర్లాండ్, కిమ్ గ్రాత్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ఆస్ట్రేలియా 18.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 173 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బెత్ మూనీ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అలిస్సా హీలీ(37), తహిలా మెక్గ్రాత్(40 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో దేవికా వైద్య ఒక వికెట్ తీయగా... మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. బౌలింగ్ వైఫల్యంతో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఈ మ్యాచ్తో తెలుగు అమ్మాయి అంజలి శర్వాణీ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. ఆదోనికి చెందిన అంజలి శర్వాణీ అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయి ప్లేయర్గా ఎదిగింది.
ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.