టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో కనివినీ ఎరుగని రికార్డ్ నమోదు చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో తొలి బంతికే 13 పరుగులు రాబట్టిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో యశస్వి జైస్వాల్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగగా.. తొలి ఓవర్ను జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా వేసాడు. ఫస్ట్ బాల్ను అతను నోబాల్గా వేయగా.. యశస్వి జైస్వాల్ సిక్స్ బాదాడు. నడుము కంటే ఎత్తులో వచ్చిన ఈ బంతిని యశస్వి జైస్వాల్.. ఓవర్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ తరలించాడు. నడుము కంటే ఎత్తులో ఈ బంతి రావడంతో అంపైర్ నోబాల్గా ప్రకటించాడు.

ఫ్రీ హిట్గా లభించిన మరుసటి బంతిని జైస్వాల్.. బ్యాక్ఫుట్లో స్ట్రైట్గా సిక్సర్ బాదాడు. దాంతో ఒక్క బంతికే టీమిండియాకు 13 పరుగులు లభించాయి. ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్గా యశస్వి జైస్వాల్ చరిత్రకెక్కాడు. 21 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ప్రస్తుతం ఈ రికార్డ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మెరుపులు మెరిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని రెండు వికెట్లు తీయగా.. సికందర్ రాజా, బ్రాండన్ మవుతా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే ముఖేష్ కుమార్ ధాటికి 125 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైర్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 34), మరుమని(24 బంతుల్లో 5 ఫోర్లతో 27), ఫరాజ్ అక్రమ్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబే(2/25) రెండు వికెట్లు తీసాడు.