ఐపీఎల్ 2024 సీజన్లో సంచలన బౌలింగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ను ఉద్దేశ పూర్వకంగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించిన మయాంక్ యాదవ్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు.
అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడుతాడని అంతా భావించారు. టీ20 ప్రపంచకప్ 2024 జట్టులోకి కూడా తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమైంది. కానీ అంతలోనే మయాంక్ యాదవ్ గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్లో చాలా మ్యాచ్లు ఆడలేదు. ఈ క్రమంలోనే మయాంక్ యాదవ్ విషయంలో బీసీసీఐ ఆచితూచి అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నా.. జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు. మరో పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్లా ఇలా వచ్చి అలా వెళ్లి పోవద్దనే పక్కనపెట్టింది. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటడంతో పాటు బౌలింగ్ నైపుణ్యాలు పెంచుకున్న తర్వాతే భారత జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
ఈ తరం క్రికెట్లో పేస్తో పాటు వేరియేషన్స్ ఉంటేనే బౌలర్లు రాణించగలుగుతారు. అందుకే దేశవాళీ క్రికెట్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఈ కుర్రాడికి బీసీసీఐ సూచించింది. ప్రస్తుతం అతన్ని దగ్గరగా పరిశీలిస్తోంది. ఎన్సీఏలోనే మయాంక్ యాదవ్ ట్రైనింగ్ అవుతున్నాడు. ఈ ఏడాది జరిగే విజయ్ హజారే ట్రోఫీ, ముస్తాక్ అలీ టీ20, దులీప్ ట్రోఫీల్లో నిలకడగా సత్తా చాటితేనే మయాంక్ యాదవ్ను భారత జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. వేగంగా బంతులేసే క్రమంలో మయాంక్ యాదవ్ తరుచూ గాయపడుతున్నాడు. కాబట్టి అతను ఫిట్నెస్ సాధించడం కూడా ముఖ్యం.
కశ్మీర్ పేస్ సెన్సేషన్ ఉమ్రాన్ మాలిక్ సైతం.. ఇలానే ఐపీఎల్లో వేగవంతమైన బంతులతో అందరి దృష్టి ఆకర్షించి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ కీలక మ్యాచ్ల్లో అతను సత్తా చాటలేకపోయాడు. దాంతోనే మయాంక్ యాదవ్ విషయంలో బీసీసీఐ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది.