ప్రేక్షకులు ఉత్సాహపరచడంతోనే విశ్వవిజేత అయిన టీమిండియాపై విజయం సాధించామని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో జింబాబ్వే 13 పరుగులు తేడాతో టీమిండియాను ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులే చేసింది. క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్(2/11) సత్తా చాటారు.

అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియా అనూహ్యంగా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 31), వాషింగ్టన్ సుందర్(34 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 27 ) మినహా అంతా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా(3/25), టెండాయ్ చతరా(3/16) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన సికిందర్ రాజా.. ఈ గెలుపుతో తాము పొంగి పోవడం లేదన్నాడు. విశ్వ విజేత అయిన టీమిండియా ఎలా పుంజుకుంటుందో తమకు తెలుసన్నాడు.
'ఈ మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ విజయంతోనే మా పని పూర్తి కాలేదు. సిరీస్ ముగియలేదు. విశ్వవిజేత ఎప్పుడూ ఛాంపియన్లానే ఆడుతోంది. కాబట్టి మేం తదుపరి మ్యాచ్కు సిద్దంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది 115 పరుగులే చేయాల్సిన వికెట్ ఏ మాత్రం కాదు. ఈ క్రెడిట్ ఇరు జట్ల బౌలర్లది.
ఈ మ్యాచ్తో మా నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందనేది స్పష్టమైంది. మా డ్రెస్సింగ్ రూమ్లో మా ఆటగాళ్లకు ఒక్కటే చెప్పాను. టీమ్ ప్రణాళికలకు తగ్గట్లు ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తే ఫలితాన్ని కూడా పట్టించుకోనని తెలిపాను. మేం ఈ ప్రణాళిక కట్టుబడి ఆడాం. మా కుర్రాళ్లకు అండగా నిలిచాం.
మా ఫీల్డింగ్, క్యాచ్లు పట్టిన విధానం అద్భుతం. కానీ మేం కొన్ని తప్పిదాలు చేశాం. డ్రెస్సింగ్ రూమ్లో వాటి గురించి చర్చించుకొని మెరుగుపరుచుకుంటాం. మా అభిమానులు మమ్మల్ని ఉత్సాహపరుస్తారని తెలుసు. ఈ గెలుపు క్రెడిట్ వారిదే.'అని సికిందర్ రాజా చెప్పుకొచ్చాడు.