కీలక క్యాచ్లను నేలపాలు చేయడంతోనే భారత్ చేతిలో ఓటమిపాలయ్యామని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా అన్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20లో టీమిండియా 100 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 1-1తో టీమిండియా సమం చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సికిందర్ రాజా.. ఫీల్డింగ్లో చేసిన తప్పిదాలు ఘోర పరాజయానికి కారణమయ్యాయని చెప్పాడు. 'వరల్డ్ ఛాంపియన్స్.. వరల్డ్ ఛాంపియన్స్లాగే ఆడారు. క్యాచ్లు నేలపాలు చేయడం మా ఓటమిని శాసించింది. ఈ వికెట్పై 200 పరుగుల లక్ష్యాన్ని నేను ముందే ఊహించాను. కానీ మేం అదనంగా 30 పరుగులు ఇచ్చాం.

అయినా ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని భావించా. కానీ మా టాపార్డర్ దారుణంగా విఫలమైంది. బ్లెస్సింగ్ చాలా దూకుడుగా ఆడాడు. అతను చాలా ఆకలితో ఉన్నాడు. ఫిట్గా ఉన్నంత కాలం అతని గ్రాఫ్ ఆమాంతం పెరుగుతోంది. ఈ మ్యాచ్లో మేం మా షాట్లు ఆడాం. కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. అనుభవం లేమి కూడా మా పేలవ బ్యాటింగ్కు కారణమైంది.'అని సికిందర్ రాజా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్లతో 100) శతక్కొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ముఖేష్ కుమార్(3/37), ఆవేశ్ ఖాన్(3/15) మూడేసి వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్(2/11), వాషింగ్టన్ సుందర్(1/28) కీలక వికెట్లు తీసారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43), లూక్ జోంగ్వే(33) బ్రియాన్ బెన్నెట్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.