జింబాబ్వే పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా పేలవ బ్యాటింగ్ కారణంగా 13 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. కుర్రాళ్ల వైఫల్యం టీమిండియా కొంపముంచింది. వారం రోజుల క్రితమే టీ20 ఫార్మాట్ విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా.. ఆ విజయాన్ని మరిచిపోకముందే పసికూన జింబాబ్వే చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది.
టీ20 ప్రపంచకప్ ఆడిన సీనియర్లంతా ఈ సిరీస్కు దూరంగా ఉంచిన బీసీసీఐ.. ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్లను ఈ పర్యటనకు పంపించింది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని కుర్రాళ్ల జట్టు తేలిపోయింది. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయకుండా.. పేలవ షాట్లతో మూల్యం చెల్లించుకుంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులే చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు.
మొత్తం నలుగురు బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్(2/11) జింబాబ్వే పతనాన్ని శాసించగా.. ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుబ్మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 31), వాషింగ్టన్ సుందర్(34 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 27 ), ఆవేశ్ ఖాన్(12 బంతుల్లో 3 ఫోర్లతో 16) డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
అరంగేట్ర ప్లేయర్లు, ఐపీఎల్ స్టార్స్ అభిషేక్ శర్మ(0), రియాన్ పరాగ్(2), ధ్రువ్ జురెల్(6) తీవ్రంగా నిరాశపరిచారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వాడ్(7), రింకూ సింగ్(0)లు కూడా దారుణంగా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా(3/25), టెండాయ్ చతరా(3/16) మూడేసి వికెట్లు తీయగా.. బ్రియాన్ బెన్నెట్, వెల్లింగ్టన్, బ్లెస్సింగ్, లూక్ జోంగ్వే తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం(జూలై 7) జరగనుంది.