బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనుకంజలో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులే చేసింది. క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) డబుల్ డిజిట్ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్(4/13), వాషింగ్టన్ సుందర్(2/11) సత్తా చాటారు.

అనంతరం స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియా అనూహ్యంగా 19.5 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌటైంది. శుభ్మన్ గిల్(29 బంతుల్లో 5 ఫోర్లతో 31), వాషింగ్టన్ సుందర్(34 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 27 ) మినహా అంతా విఫలమయ్యారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా(3/25), టెండాయ్ చతరా(3/16) మూడేసి వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభ్మన్ గిల్.. బ్యాటర్ల నిర్లక్ష్యమే టీమిండియా ఓటమిని శాసించిందన్నాడు. తనతో సహా జట్టులో ఒక్కరు కూడా టీమ్ ప్రణాళిక తగ్గట్లు ఆడలేదని చెప్పాడు. తాను చివరి వరకు ఉంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంలో కూడా ఎలాంటి తప్పిదం లేదన్నాడు.
'మేం అద్భుతంగా బౌలింగ్ చేశాం. కానీ బ్యాటింగ్లో చేతులెత్తేశాం. కనీసం మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. జట్టులోని ప్రతీ ఒక్కరు నిర్లక్ష్యంగా కనిపించారు. టైమ్ తీసుకోని బ్యాటింగ్ను ఆస్వాదించాలనేది మా ప్రణాళిక. కానీ ఏ ఒక్కరు అలా ఆడలేకపోయారు. సగం స్కోర్ చేయకముందే 5 వికెట్లు కోల్పోయాం. నేను చివరి వరకు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
నేను ఔటైన తీరు నిరాశకు గురిచేసింది. నా వికెట్తోనే మా పతనం మొదలైంది. లక్ష్యచేధనలో మా ఆటగాళ్లపై ఆశలు ఉన్నా.. 115 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 10వ బ్యాటర్ ఔటయ్యాడంటేనే మేం ఎంత ఘోర తప్పిదం చేశామో అర్థమవుతోంది.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.