అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ల అసాధారణ బ్యాటింగ్తోనే జింబాబ్వేపై విజయం సాధించామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. బ్యాటింగ్కు కష్టంగా ఉన్న సమయంలో ఈ ఇద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పారని కొనియాడాడు. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 100 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(46 బంతుల్లో 7 బౌండరీలు, 8 సిక్స్లతో 100) శతక్కొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 77 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకు కుప్పకూలింది. ముఖేష్ కుమార్(3/37), ఆవేశ్ ఖాన్(3/15) మూడేసి వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించగా.. రవి బిష్ణోయ్(2/11), వాషింగ్టన్ సుందర్(1/28) కీలక వికెట్లు తీసారు. జింబాబ్వే బ్యాటర్లలో ఓపెనర్ వెస్లీ మధెవెరె(43), లూక్ జోంగ్వే(33) బ్రియాన్ బెన్నెట్(26) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా 1-1తో సమంగా నిలిచింది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్మన్ గిల్.. అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.'తొలి మ్యాచ్ ఓటమి నుంచి తేరుకుని విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ బ్యాటింగ్తోనే ఈ గెలుపు సాధ్యమైంది.
పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం అంత సులువుగా లేదు. బంతి బాగా స్వింగ్ అయ్యింది. కానీ అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ అసాధారణ బ్యాటింగ్తో ఇన్నింగ్స్ను నిర్మించారు. తొలి టీ20లో మేం ఒత్తిడిని అధిగమించలేకపోయాం. కుర్రాళ్లతో కూడిన జట్టు కావడం.. చాలా మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోవడంతో ఒత్తిడిని తట్టుకోలేకపోయారు.
తొలి మ్యాచ్లోనే ఇలాంటి ఒత్తిడికి గురవ్వడం మంచిది అయ్యింది. దాంతోనే ఈ మ్యాచ్కు ఎలా సిద్దం కావాలనేది తెలిసింది. ఈ సిరీస్లో మేం ఇంకా మూడు మ్యాచ్లు ఆడాలి. వాటిని గెలవడంపై ఫోకస్ పెట్టాం. జట్టు ఎంపికకు చాలా ఆప్షన్స్ ఉండటం మంచిదే.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.