జింబాబ్వే పర్యటనలో టీమిండియా జోరు కొనసాగుతోంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 23 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. డియోన్ మైర్స్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 65 నాటౌట్), క్లైవ్ మదండే(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/15) వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్(1/15) ఓ వికెట్ తీసాడు.
183 పరుగులు భారీ లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వేకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆవేశ్ ఖాన్ వేసిన రెండో ఓవర్లోనే వెస్లీ మధెవెర్(1)క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్.. మరో ఓపెనర్ తడివానాశే మారుమని(13)ని క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన బ్రియాన్ బెన్నెట్(3)ను ఆవేశ్ ఖాన్ ఔట్ చేయడంతో 19 పరుగులకే జింబాబ్వే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డియోన్ మైర్స్, కెప్టెన్ సికందర్ రాజా(15) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. దాంతో పవర్ ప్లేలో జింబాబ్వే 3 వికెట్లకు 37 పరుగులు చేసింది.
బంతిని అందుకున్న వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్లో సికందర్ రాజా(15), జోనాథన్ కాంప్బెల్(1)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో 39 పరుగులకే జింబాబ్వే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్లైవ్ మదండేతో కలిసి డియోన్ మైర్స్ జట్టును ఆదుకున్నాడు. ఆరో వికెట్కు 77 పరుగులు జోడించిన అనంతరం క్లైవ్ మదండేను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేర్చాడు. మరోవైపు డియోన్ మైర్స్ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డియోన్ మైర్స్ పోరాడినా.. చేయాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండటంతో జింబాబ్వేకు ఓటమి తప్పలేదు.