జింబాబ్వేతో జరుగుతున్న ఐదో టీ20లో టీమిండియా 168 పరుగుల లక్ష్యాన్ని నమోదు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది.
శివమ్ దూబే(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మెరుపులు మెరిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని రెండు వికెట్లు తీయగా.. సికందర్ రాజా, బ్రాండన్ మవుతా తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. నోబాల్ సాయంతో రెండు భారీ సిక్స్లు బాది ఫస్ట్ బాల్కే 13 పరుగులు పిండుకున్న యశస్వి జైస్వాల్(12) తొలి ఓవర్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సికందర్ రాజా వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లో తొలి బంతి హై ఫుల్ టాస్గా వేయగా యశస్వి సిక్సర్ తరలించాడు.
బంతి నడుము కంటే ఎత్తులో రావడంతో అంపైర్ నోబాల్ ప్రకటించాడు. ఫ్రీహిట్గా లభించిన మరుసటి బంతిని కూడా యశస్వి సిక్సర్గా బాదాడు. దాంతో టీ20 క్రికెట్ చరిత్రలోనే ఎదుర్కొన్న తొలి బంతికి 13 పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్రకెక్కాడు.
అదే ఓవర్ నాలుగో బంతికి యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ కాగా.. క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ(14) ఓ సిక్సర్, బౌండరీ బాది దూకుడు కనబర్చాడు. కానీ అదే జోరులో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్లోనే శుభ్మన్ గిల్(13) కూడా ఔటవ్వడంతో 40 పరుగులకే టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్(22)తో కలిసి సంజూ శాంసన్ ఆచితూచి ఆడాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్న ఈ జోడీ స్లోగా బ్యాటింగ్ చేసింది. సంజూ శాంసన్ భారీ సిక్స్లు బాదినా రియాన్ పరాగ్ సింగిల్స్కే పరిమితమయ్యాడు. నాలుగో వికెట్కు 65 పరుగులు జోడించిన అన ంతరం రియాన్ పరాగ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
మరోవైపు సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో క్యాచ్ ఔటయ్యాడు. శివమ్ దూబే తనదైన శైలిలో 2 ఫోర్లు, 2 సిక్స్లు బాది జట్టు స్కోర్ను 150 పరుగులు ధాటించాడు. దురదృష్టవశాత్తు అతను రనౌట్గా వెనుదిరిగాడు. రింకూ సింగ్(11 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (1 నాటౌట్) జట్టు స్కోర్ను 167 పరుగులకు చేర్చారు.