జింబాబ్వే పర్యటనను టీమిండియా విజయంతో ముగించింది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో జింబాబ్వేను చిత్తు చేసింది.
ముఖేష్ కుమార్(4/22) సంచలన ప్రదర్శనతో ఆఖరి మ్యాచ్లో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మెరుపులు మెరిపించాడు.

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని రెండు వికెట్లు తీయగా.. సికందర్ రాజా, బ్రాండన్ మవుతా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే ముఖేష్ కుమార్ ధాటికి 125 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైర్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 34), మరుమని(24 బంతుల్లో 5 ఫోర్లతో 27), ఫరాజ్ అక్రమ్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబే(2/25) రెండు వికెట్లు తీసాడు.
168 పరుగుల లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వేకు తొలి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ వెస్లీ మధెవెరె(0)ను ముఖేష్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తన మరుసటి ఓవర్లో బ్రియాన్ బెన్నెట్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 15 పరుగులకే జింబాబ్వే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డియోన్ మైర్స్, మరుమని ఆచితూచి ఆడారు. మూడో వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం మురమణిని వాషింగ్టన్ సుందర్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.
ఆ కొద్దిసేపటికే డియోన్ మైర్స్ను శివమ్ దూబే ఔట్ చేయడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. శివమ్ దూబే సూపర్ త్రోకు సికందర్ రాజా(8) రనౌటవ్వగా.. జోనా కాంప్బెల్, క్లైవ్ మందండే(4) తీవ్రంగా నిరాశపరిచారు. ఫరాజ్ అక్రమ్(27) కాస్త పోరాడినా.. మిగతా బ్యాటర్లు సహకరించలేదు.