టీమిండియా తాత్కలిక సారథి శుభ్మన్ గిల్పై యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను సారథి కాకున్నా.. ఎప్పుడూ కెప్టెన్గానే వ్యవహరిస్తాడని తెలిపాడు. జింబాబ్వే పర్యటనతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రియాన్ పరాగ్కు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశాలు దక్కలేదు. తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమైన రియాన్ పరాగ్.. ఆఖరి మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్ విఫలమైన వేళ.. సంజూ శాంసన్తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో భారత్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ అనంతరం సహచర ఆటగాడు అభిషేక్ శర్మతో కలిసి మాట్లాడిన రియాన్ పరాగ్.. తొలి మ్యాచ్ పరాజయంతో మేల్కొన్నామని తెలిపాడు. 'ఈ విజయం చాలా గొప్ప అనుభూతినిస్తోంది. తొలి పరాజయం తర్వాత జట్టులోని అందరూ మేల్కొన్నారు. ఈ విజయం చాలా గర్వంగా ఉంది. జట్టులోని కుర్రాళ్లంతా ఈ గెలుపును ఆస్వాదిస్తున్నారు. అభిషేక్ శర్మ, నేను ఇద్దరం కలిసి మా టీమిండియా జెర్సీలను ఓపెన్ చేశాం. నేను అతని రూమ్కు వెళ్లగా.. అభిషేక్ ముందు తన జెర్సీని తెరిచాడు.

ఆ తర్వాత నేను నా జెర్సీ ధరించాను. 2018 అండర్ 19 ప్రపంచకప్లో నేను, అభిషేక్, శుభ్మన్ గిల్ కలిసా ఆడాం. ఆ తర్వాత 6 ఏళ్లు మేం మళ్లీ కలిసి ఆడలేదు. ఇద్దరం కలిసి అరంగేట్రం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్లో సంజూ భయ్యాతో నేను మాట్లాడాను. ఆచితూచి ఆడాలని నిర్ణయించుకున్నాం. రాజస్థాన్ రాయల్స్కు ఆడినట్లు ఇన్నింగ్స్ నిర్మించాలనుకున్నాం. ఓవైపు వికెట్లు ఉంటే.. వేగంగా ఆడవచ్చని భావించాం. శుభ్మన్ గిల్ సారథి కాకపోయినా కెప్టెన్గానే వ్యవహరిస్తాడు. ఏజ్ క్రికెట్ నుంచి అతనితో ఆడుతున్నాం. మైదానంలో అతను అసాధారణ ప్రదర్శన కనబరుస్తాడు.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.