టీమిండియా యువబ్యాటర్ రియాన్ పరాగ్ చరిత్ర సృష్టించాడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన తొలి ప్లేయర్గా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం జరిగిన తొలి టీ20తో ఈ అస్సాం క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
తన తల్లిదండ్రుల చేతుల మీదుగా రియాన్ పరాగ్ అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. రియాన్ పరాగ్ కంటే ముందు ఈశాన్య రాష్ట్రాల నుంచి ఏ ఆటగాడు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించలేదు. ఈశాన్య రాష్ట్రాల నుంచి అండర్ 19 ప్రపంచకప్ ఆడిన తొలి ప్లేయర్ కూడా రియాన్ పరాగే. 2018 అండర్ 19 ప్రపంచకప్లో రియాన్ పరాగ్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

అయితే ఈ అరంగేట్ర మ్యాచ్లో రియాన్ పరాగ్ దారుణంగా విఫలమయ్యాడు. 3 బంతుల్లో 2 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. చతరా వేసిన ఐదో ఓవర్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్ దిశగా వేసిన లెంగ్త్ డెలివరీని పరాగ్ ఓవర్ మిడాన్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ బ్రాండన్ మవుతా సూపర్ ఫీల్డింగ్తో పరాగ్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు.
ఇప్పటి వరకు 115 టీ20 ప్రొఫెషనల్ గేమ్స్ ఆడిన రియాన్ పరాగ్ 2618 పరుగులు చేసాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 15 మ్యాచ్ల్లో 573 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఈ ప్రదర్శనతోనే రియాన్ పరాగ్ జింబాబ్వే పర్యటనకు ఎంపికయ్యాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్), బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మొత్తం నలుగురు బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు .. వాషింగ్టన్ సుందర్(2/11) రెండు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించారు. ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.