జింబాబ్వేతో తొలి టీ20లో టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్(4/13) సంచలన ప్రదర్శన కనబర్చాడు. అతనికి తోడుగా మిగతా బౌలర్లు కూడా సత్తా చాటడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది.
జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్), బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మొత్తం నలుగురు బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు .. వాషింగ్టన్ సుందర్(2/11) రెండు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించారు. ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

నిప్పులు చెరిగిన రవి బిష్ణోయ్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన జింబాబ్వేకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ముఖేష్ కుమార్ వేసిన స్టన్నింగ్ డెలివరీకి జాంబాబ్వే ఓపెనర్ ఇన్నోసెంట్ కయా(0) రెండో ఓవర్లోనే గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన బ్రియాన్ బెన్నెట్(22)తో మరో ఓపెనర్ వెస్లీ మధెవెరే(21) ఆచితూచి ఆడాడు. ఈ ఇద్దరూ 34 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీసాడు.
వరుస ఓవర్లలో ఈ ఇద్దర్నీ క్లీన్ బౌల్డ్గా పెవిలియన్ చేర్చాడు. దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన కెప్టెన్ సికిందర్ రాజా(17)ను ఆవేశ్ ఖాన్ ఔట్ చేయగా.. అదే ఓవర్లో జోనాథన్ కాంప్బెల్(0) రనౌటయ్యాడు. దాంతో జింబాబ్వే 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆడిన డియాన్ మేయర్స్(23)ను వాషింగ్టన్ సుందర్ రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
పోరాడిన మదాండే .
ఆ మరుసటి బంతికే వెల్లింగ్టన్ మసకడ్జా(0)ను స్టంపౌట్ చేయడంతో జింబాబ్వే కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఒకే ఓవర్లో జింబాబ్వే టెయిలండర్స్ లూక్ జోంగ్వే(1), బ్లెస్సింగ్ ముజరబనీ(0)లను రవి బిష్ణోయ్ పెవిలియన్ చేర్చి కోలుకోలేని దెబ్బతీసాడు. చివర్లో క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.
టెండాయ్ చతారా(0)తో కలిసి ఆఖరి వికెట్కు 29 పరుగులు జోడించాడు. దాంతో జింబాబ్వే 116 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయగలిగింది.