IND vs ZIM: కళ్లు దొబ్బినయా? ఇషాన్ కిషన్పై అక్షర్ పటేల్ ఆగ్రహం (వీడియో)

హరారే: టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్పై స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కళ్లు దొబ్బినయా? లేక తల పగలగొడదామనుకున్నావా? అంటూ మండిపడ్డాడు. ఇషాన్ కిషన్ క్షమాపణలు చెప్పినప్పటికీ.. ఇంత అలసత్వం ఎందుకని సీరియస్ అయ్యాడు. జింబాబ్వేతో శనివారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు సైతం ఇషాన్ కిషన్ను తప్పుబడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇంత నిర్లక్ష్యం తగదంటున్నారు. మరికొందరు మాత్రం ఇంతదానికి అంతలా రియాక్ట్ అవ్వలా? అంటూ అక్షర్ పటేల్ను విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయ్యింది.

అసలేం జరిగిందంటే..?
జింబాబ్వే ఇన్నింగ్స్ సందర్భంగా దీపక్ హుడా వేసిన 28 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని జింబాబ్వే బ్యాటర్ బర్ల్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ఇషన్ కిషన్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే బంతిని బౌలర్ వైపు విసిరేసే క్రమంలో మిడ్ వికెట్ దిశగా త్రో చేశాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ బంతి తనకు ఎక్కడ తగులుతుందన్న భయంతో తలపై చేతులు పెట్టుకుని కింద కూర్చున్నాడు. అయినప్పటికీ కిషన్ విసిరిన బంతి నేరుగా అక్షర్ తలకు తగిలింది.

భారత్దే సిరీస్
దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అక్షర్ పటేల్ ఇషాన్ వైపు సీరియస్గా చూస్తూ నోటికి పనిచెప్పాడు. మరోవైపు ఇషాన్ కిషన్ క్షమాపణలు చెబుతున్నట్లు చేతులతో సైగలు చేశాడు. అయినప్పటికీ బంతి తాకిన మంటతో ఉన్న అక్షర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరూ చాలా దూరంగా ఉండటంతో పెద్ద గొడవ తప్పింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది.

శార్దూల్ తీన్మార్..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 38.1 ఓవర్లలోనే 161 పరుగులకు కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి కనీసం 50 ఓవర్లు కూడా క్రీజులో నిలవలేకపోయింది. ఆ జట్టులో సీన్ విలియమ్స్(42), ర్యాన్ బర్ల్(39 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలో వికెట్ తీసారు.

సంజూ షాన్దార్
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 25.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. తొలి వన్డే మాదిరి నిదానంగా ఆడకుండా దూకుడుగా ఆడిన భారత్ 154 బంతుల్లోనే విజయాన్నందుకుంది. మరోసారి శిఖర్ ధావన్(21 బంతుల్లో 4 ఫోర్లతో 33), శుభ్మన్ గిల్(34 బంతుల్లో 6 ఫోర్లతో 33) ఫర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 43 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్(1), ఇషాన్ కిషన్(6) విఫలమవ్వగా.. దీపక్ హుడా(25) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో లూక్ జాంగ్వే రెండు వికెట్లు తీయగా.. తానక చివంగా, విక్టర్ న్యూచి, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications