టీమిండియా కుర్రాళ్లు అభిషేక్ శర్మ, రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి టీ20 పరాజయమో లేక.. పసికూన జింబాబ్వే చేతిలో ఓడామనే అవమానమో.. తెలియదు కానీ రెండో టీ20లో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకు పడ్డారు. ఈ ఇద్దరి సునామీ ఇన్నింగ్స్కు రుతురాజ్ గైక్వాడ్ క్లాస్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో టీమిండియా 235 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది.
అభిషేక్ శర్మ(47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్లతో 100) శతక్కొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్(47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 77 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. చివర్లో రింకూ సింగ్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 48 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 234 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, వెల్లింగ్టన్ మసకడ్జా తలో వికెట్ తీసారు.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్లోనే కెప్టెన్ శుభ్మన్ గిల్(2) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్తో కలిసి అభిషేక్ శర్మ ఆచితూచి ఆడాడు. క్రీజులో సెట్ అయ్యేందుకు ఈ జోడీ టైమ్ తీసుకుంది. దాంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది.
అనంతరం అభిషేక్ శర్మ తన బ్యాట్కు పనిచెప్పాడు. ఓవైపు రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదిగా ఆడగా.. మరోవైపు అభిషేక్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడిన అభిషేక్ శర్మ మరో 13 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
మసకడ్జా వేసిన 14వ ఓవర్లో భారీ సిక్స్ బాది కెరీర్లో ఫస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఆ మరుసటి బంతికే క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ రాగా.. రుతురాజ్ గైక్వాడ్ 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో ఈ ఇద్దరూ పోటాపోటీగా సిక్స్లు బాదడంతో టీమిండియా స్కోర్ బోర్డు పరుగెత్తింది.