టీమిండియా యువ ప్లేయర్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్లు తమ అరంగేట్ర మ్యాచ్లో తీవ్రంగా నిరాశపరిచారు. ఐదు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లిన భారత జట్టులో చోటు దక్కించుకున్న ఈ ఐపీఎల్ స్టార్స్.. శనివారం హరారే వేదికగా జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు
భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ కుర్రాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ(0) డకౌటవ్వగా.. రియాన్ పరాగ్ (2) పరుగులే చేసి వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్(7) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.

116 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అభిషేక్ శర్మ(0) డకౌట్ రూపంలో భారీ షాక్ తగిలింది. బ్రియాన్ బెన్నెట్ వేసిన తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ వెల్లింగ్టన్ మసకడ్జాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. డీప్ మిడ్ వికెట్ దిశగా అభిషేక్ శర్మ షాట్ ఆడగా.. మిస్టైమ్ అయిన బంతి ఫీల్డర్ చేతిలోకి దూసుకెళ్లింది. దాంతో టీమిండియా ఒక్క పరుగు చేయకుండానే అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయింది.
క్రీజులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(7) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ముజర్బానీ బౌలింగ్లో క్యాచ్ ఔటయ్యాడు. క్రీజులోకి రియాన్ పరాగ్ రాగా.. చతరా వేసిన ఐదో ఓవర్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్ దిశగా వేసిన లెంగ్త్ డెలివరీని పరాగ్ ఓవర్ మిడాన్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ బ్రాండన్ మవుతా సూపర్ ఫీల్డింగ్తో బంతిని అద్భుతంగా అందుకున్నాడు. దాంతో పరాగ్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
అదే ఓవర్ చివరి బంతికి రింకూ సింగ్(0) కూడా వెనుదిరిగాడు. దాంతో 22 పరుగులకే టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్తో కలిసి శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ధ్రువ్ జురెల్(7) తీవ్రంగా నిరాశపరిచాడు.
జోంగ్వే బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 43 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ వెంటనే నిలకడగా ఆడుతున్న శుభ్మన్ గిల్(31)ను సికిందర్ రాజా క్లీన్ బౌల్డ్ చేయడంతో టీమిండియాకు కోలుకోలేని దెబ్బపడింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్లలో క్లైవ్ మదాండే(25 బంతుల్లో 4 ఫోర్లతో 29 నాటౌట్), బ్రియాన్ బెన్నెట్(22), వెస్లీ మధెవెరే(21), డియోన్ మేయర్స్(23) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మొత్తం నలుగురు బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ నాలుగు వికెట్లు .. వాషింగ్టన్ సుందర్(2/11) రెండు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించారు. ముఖేష్ కుమార్, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.