అండర్ 19 ప్రపంచకప్ సహచరుడు రియాన్ పరాగ్తో కలిసి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేస్తానని అస్సలు ఊహించలేదని టీమిండియా యువ ప్లేయర్ అభిషేక్ శర్మ అన్నాడు. టీమిండియా జెర్సీ ధరిస్తే తమ కల నెరవేరినట్లేనని ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా మాట్లాడుకున్నామని గుర్తు చేసుకున్నాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడారు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ.. తమ అరంగేట్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి టీ20 పరాజయం అనంతరం తాము మేల్కోన్నామని, మరుసటి రోజే మ్యాచ్ ఉండటంతో ఆ ఓటమి గురించి ఎక్కువ ఆలోచించలేదన్నాడు.

'గత రెండు మ్యాచ్ల్లో నేను అద్భుతంగా బౌలింగ్ చేశాను. రియాన్ పరాగ్ చెప్పినట్లు తొలి టీ20 పరాజయం అనంతరం మేం అంతా మేల్కొన్నాం. మరుసటి రోజే మ్యాచ్ ఉండటంతో ఈ ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం గురించి రియాన్ పరాగ్, నేను ఐపీఎల్లో మాట్లాడుకున్నాం. టీమిండియా క్యాప్ అందుకుంటే మా కల నిజమైనట్లేనని భావించాం. కానీ ఇద్దరం కలిసి ఇలా ఒకే మ్యాచ్లో అరంగేట్రం చేస్తామని అస్సలు ఊహించలేదు.
చాలా రోజుల క్రితం మాట్లాడుకున్న విషయం ఇప్పుడు జరిగింది. శుభ్మన్ గిల్, కోచ్లు నా బౌలింగ్పై పూర్తి నమ్మకం ఉంచారు. తొలి రెండు టీ20ల్లో బౌలింగ్లో విఫలమైనా.. నాతో బౌలింగ్ చేయించారు. నా బౌలింగ్పై నేను వర్క్ చేస్తున్నాను. మేనేజ్మెంట్ కూడా అండగా నిలిచింది. లెజెండ్స్ ఛాంపియన్షిప్లో పాకిస్థాన్పై భారత్ గెలవడం సంతోషంగా అనిపించింది. నా మెంటార్ యువరాజ్ సింగ్కు అభినందనలు'అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మెరుపులు మెరిపించాడు.
జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని రెండు వికెట్లు తీయగా.. సికందర్ రాజా, బ్రాండన్ మవుతా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే ముఖేష్ కుమార్ ధాటికి 125 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైర్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 34), మరుమని(24 బంతుల్లో 5 ఫోర్లతో 27), ఫరాజ్ అక్రమ్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబే(2/25) రెండు వికెట్లు తీసాడు.