జింబాబ్వే పర్యటనలో టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం జరిగే నాలుగో టీ20లో ఆతిథ్య జింబాబ్వేతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ సిరీస్లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. నాలుగో టీ20లో విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనుకుంటోంది.
అయితే ఈ మ్యాచ్కు ముందు అభిమానులు టీమిండియా మేనేజ్మెంట్కు ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నారు. యువ క్రికెటర్, ఐపీఎల్ సెన్సేషన్ అభిషేక్ శర్మను ఓపెనర్గా ఆడించాలని కోరుతున్నారు. ఈ సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఓపెనర్గా ఫస్ట్ మ్యాచ్లో డకౌటయ్యాడు. రెండో మ్యాచ్లో మాత్రం విధ్వంసకర శతకంతో చెలరేగాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన రాకను ఘనంగా చాటుకున్నాడు.

పవర్ ప్లేలో ఉన్న రిస్ట్రిక్షన్స్ను అభిషేక్ శర్మ అద్భుతంగా ఉపయోగించుకోగలడని, పవర్ హిట్టింగ్తో భారీ స్కోర్లు అందించగలడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్లో అభిషేక్ శర్మ ఓపెనర్గా విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడాడని, అతన్ని ఫస్ట్ డౌన్లో పంపించి మంచి ఓపెనర్ను మిస్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం అభిషేక్ శర్మకు మాత్రమే ఉందని అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే యశస్వి జైస్వాల్ను మిడిలార్డర్లో ఆడించాలని కోరుతున్నారు.
ఈ మ్యాచ్కు టీమిండియా తుది జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగే అవకాశం ఉంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా గత మూడు మ్యాచ్లు ఆడిన ఆవేశ్ ఖాన్కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. అతని స్థానంలో ముఖేష్ కుమార్ రీఎంట్రీ ఇవ్వవచ్చు. మిగతా కాంబినేషన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు.
జింబాబ్వేతో నాలుగో టీ20.. భారత తుది జట్టు(అంచనా)
యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ/రియాన్ పరాగ్, సంజూ శాంసన్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్/ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.