న్యూఢిల్లీ: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సాధించిన రికార్డు సెంచరీని చూసి యావత్ క్రికెట్ ప్రపంచం ఆనందిస్తుండగా.. అతని సొంత తండ్రి మాత్రం ఈ అరుదైన ఇన్నింగ్స్ చూడలేకపోయాడు. వెస్టిండీస్తో తొలి టెస్ట్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యశస్వి.. తొలి మ్యాచ్లోనే రికార్డు సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో మూడు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన యశస్వి..387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 171 పరుగులు చేశాడు. విదేశాల్లో అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా అరంగేట్ర మ్యాచ్లో సెంచరీ బాదిన 17వ భారత బ్యాటర్గా.. మూడో ఓపెనర్గా నిలిచాడు. అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక బాల్స్ ఆడిన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్తో యావత్ క్రికెట్ ప్రపంచం ఫిదా అవుతుంటే.. అతని తండ్రి మాత్రం ఈ ఇన్నింగ్స్ కనులారా చూడలేకపోయాడు. అతను కొడుకు సక్సెస్ కోసం.. ఆ దేవుడిని ప్రార్థిస్తూ 900 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు. ఆ శివుడిని ప్రార్థిస్తూ కన్వర్ యాత్ర చేపట్టాడు.
ప్రతీ ఏడా శివ భక్తులు కన్వర్ యాత్ర చేస్తారు. పవిత్ర గంగ జలాన్ని సేకరించేందుకు శివ భక్తులు ఈ యాత్ర చేస్తారు. ఇది చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని వారు నమ్ముతారు. యశస్వి తండ్రి భూపేంద్ర జైస్వాల్ కూడా తన కొడుకు సక్సెస్ కోసం ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్లోని డియోఘర్కి దాదాపు 900 కి.మీ.లు కాలి నడకన నడవాలని నిర్ణయం తీసుకున్నాడు.
యశస్వి జైస్వాల్ సెంచరీతో అతని తండ్రి రియాక్షన్ కోసం సంప్రదించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ విషయాన్ని బయటపెట్టింది. కన్వర్ యాత్రలో ఉన్న భుపేంద్ర జైస్వాల్ రియాక్షన్ కూడా తీసుకుంది. 'నా కొడుకు సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. ఈ సెంచరీ, డబుల్ సెంచరీ కావాలని కోరుకుంటున్నా.' ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్తో అన్నాడు.
యశస్వి జైస్వాల్ తమ్ముడు తేజస్వి జైస్వాల్, తల్లి కంచన్ జైస్వాల్ మాత్రం ముంబైలోని కొత్త ఇంట్లో అతని అద్భుత ఇన్నింగ్స్ను వీక్షించారు. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత ముంబైలో ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న యశస్వి జైస్వాల్, టీమిండియాకు సెలక్ట్ అయిన తర్వాత ఐదు బెడ్ రూమ్ల ఫ్లాట్ను కొత్తగా కొనుగోలు చేశాడు.
సొంతింటిని నిర్మించడం యశస్వి కలని తేజస్వి జైస్వాల్ తెలిపాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్సమయంలోనూ అతను తాము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యామా? లేదా? అని అడిగాడని చెప్పుకొచ్చాడు.