డొమినికా: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా యువ ఓపెనర్, అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్ అసాధారణ ప్రదర్శనకు తెరపడింది. అద్వితీయమైన ప్రదర్శనతో డబుల్ సెంచరీ దిశగా సాగిన యశస్వి జైస్వాల్(387 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్తో 171)ను అల్జారీ జోసెఫ్ ఔట్ చేశాడు. వికెట్ కీపర్ సాయంతో పెవిలియన్ చేర్చాడు.
భారత ఇన్నింగ్స్ 126వ ఓవర్ ఐదో బంతిని అల్జారీ జోసెఫ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. యశస్వి బ్యాక్ ఫుట్ మీద ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిస్టైమ్ అయిన బంతి అతని బ్యాట్ను ముద్దాడుతూ కీపర్ చేతిలో పడింది. దాంతో డబుల్ సెంచరీ చేసే సువర్ణవకాశాన్ని యశస్వి జైస్వాల్ చేజార్చుకున్నాడు.

తద్వారా భారత్ తరఫున అరంగేట్ర మ్యాచ్లో అత్యధిక స్కోర్ చేయడంతో పాటు డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచే సువర్ణవకాశాన్ని కోల్పోయాడు. మరో 29 పరుగులు చేస్తే అరంగేట్ర మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదిన తొలి భారత ప్లేయర్గా యశస్వి చరిత్రకెక్కేవాడు. కనీసం 17 పరుగులు చేసినా.. భారత్ తరఫున అరంగేట్ర మ్యాచ్లోనే అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచేవాడు.
ఈ జాబితాలో శిఖర్ ధావన్(187), రోహిత్ శర్మ(177).. యశస్వి జైస్వాల్(171) కన్నా ముందున్నారు. క్రీజులోకి వచ్చిన అజింక్యా రహానే(3) తీవ్రంగా నిరాశపరిచాడు. కేమర్ రోచ్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 356 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది.
అనంతరం బ్యాటింగ్కు వచ్చిన రవీంద్ర జడేజా సాయంతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్న కోహ్లీ.. 147 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలిస్తున్న కోహ్లీ.. సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. మరోవైపు జడేజా(21 బ్యాటింగ్) క్రీజులో సెట్ అయ్యాడు. భారత్ స్కోర్ 400 మార్క్ ధాటగా.. ఆధిక్యం 245 పరుగులకు చేరింది.
రోహిత్ శర్మ(221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 103) సెంచరీతో రాణించగా.. శుభ్మన్ గిల్(6) విఫలమయ్యాడు. ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్(5/60) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్కు తలో వికెట్ దక్కింది.