డొమినికా: టీమిండియా యువ ఓపెనర్, సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ సహనం కోల్పోయాడు. తనకు అడ్డుగా వచ్చిన బౌలర్పై నోరుపారేసుకున్నాడు. హిందీలో రాయలేని పదాలతో బూతులు తిట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్లో యశస్వి జైస్వాల్(350 బంతుల్లో 14 ఫోర్లతో 143 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.
అరంగేట్ర మ్యాచ్లోనే శతకం బాదిన యశస్వి తన పేరిట పలు రికార్డులను కూడా లిఖించుకున్నాడు. ప్రస్తుతం క్రీజులోనే ఉన్న యశస్వి, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి భారీ ఇన్నింగ్స్ దిశగా దూసుకెళ్తున్నాడు. ఇక రెండో రోజు ఆట చివరి సెషన్లో యశస్వి జైస్వాల్.. విండీస్ పేసర్ కెమర్ రోచ్పై మండిపడ్డాడు.

పరుగుతీసే క్రమంలో కెమర్ రోచ్ పదే పదే అడ్డు రావడంతో సహనం కోల్పోయిన యశస్వి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కెమర్ రోచ్ వేసిన 103వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ సింగిల్ పూర్తి చేసుకున్న యశస్వి.. 'నాకు అడ్డు రాకు లం**'అని హిందీలో తిట్టాడు. యశస్వీ అరుపులు విన్న కోహ్లీ.. ఏమైందని ఆరా తీసాడు.
పరుగెత్తకుండా తనకు అడ్డు వస్తున్నాడని యశస్వి.. కోహ్లీకి బదులిచ్చాడు. వెంటనే కోహ్లీ.. ఎవరు.. కేమర్ రోచా? అని ప్రశ్నించాడు. దీనికి యశస్వీ అవునని బదులిచ్చాడు. ఈ సంభాషణ స్టంప్ మైక్లో రికార్డు అవ్వగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. యశస్విని ఔట్ చేసే విషయంలో చేతులెత్తేసిన విండీస్ బౌలర్లు.. అతనితో కవ్వింపులకు దిగారు. కానీ యశస్వి ధీటుగా బదులివ్వడంతో ఏం చేయలేకపోయారు.
ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 113 ఓవర్లలో 2 వికెట్లకు 312 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం162 పరుగులకు చేరుకుంది. యశస్వీ జైస్వాల్తో పాటు విరాట్ కోహ్లీ(36 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రోహిత్ శర్మ(221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 103) సెంచరీతో రాణించగా.. శుభ్మన్ గిల్(6) విఫలమయ్యాడు.
ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్(5/60) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్, శార్దూల్ ఠాకూర్కు తలో వికెట్ దక్కింది. విండీస్ బ్యాటర్లలో అలిక్ అతనాజే(47) మినహా అంతా విఫలమయ్యారు.
పూర్తి ఏకపక్షంగా సాగుతున్న ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించే అవకాశం ఉంది.