డొమినికా: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్తో రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా బుధవారం ప్రారంభమైన తొలి మ్యాచ్ బరిలోకి దిగిన కోహ్లీ.. అయ్య, కొడుకులతో కలిసి ఆడిన రెండో భారత క్రికెటర్గా చరిత్రకెక్కాడు.
పన్నెండేళ్ల కిందట వెస్టిండీస్ పర్యటనలోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ.. అప్పుడు విండీస్ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్తో ఆడాడు. 12 ఏళ్ల తర్వాత తాజా పర్యటనలో అదే శివనారయణ్ కుమారుడు త్యాగ్నారాయణ్ చంద్రపాల్తో ఆడుతున్నాడు. తాజాగా జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. త్యాగ్ నారయణ్ ఓపెనర్గా బరిలోకి దిగాడు.

దాంతో తండ్రీ, కొడుకుతో కలిసి ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. 1992లో ఆసీస్ మాజీ ఆటగాడు జెఫ్ మార్ష్తో తలపడిన సచిన్.. 2011/12 సమయంలోఆయన కుమారుడు షాన్ మార్ష్తో కూడా ఆడాడు.
ఇక టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిలకడగా ఆడుతోంది. త్యాగ్ నారయణ్ చంద్రపాల్.. క్రైగ్ బ్రాత్వైట్ భారత పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి విండీస్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది.
ఇక అందరూ ఊహించినట్లుగానే ఈ మ్యాచ్తో యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్ టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. తెలుగు తేజం కేఎస్ భరత్పై వేటు వేసిన టీమిండియా మేనేజ్మెంట్.. మూడో పేసర్గా జయదేవ్ ఉనాద్కత్కు అవకాశం ఇచ్చింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం యశస్వీ జైస్వాల్ను ఓపెనర్గా ప్రమోట్ చేసింది. శుభ్మన్ గిల్కు ఫస్ట్ డౌన్ బాధ్యతలు అప్పగించింది.
బోర్డర్ గవాస్కర్ సిరీస్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో కేఎస్ భరత్ విఫలమవడంతోనే అతనిపై వేటు వేసినట్లు అర్థమవుతోంది. కేఎస్ భరత్ కీపర్గా రాణించినా.. బ్యాటింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. దాంతో పాటు ఇషాన్ కిషన్ లెఫ్టాండర్ కావడం అతనికి అదనపు బలంగా మారింది.