గయానా: వెస్టిండీస్తో రెండో టీ20లోనూ టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. వరుసగా పెవిలియన్ బాట పట్టారు. కఠిన పరిస్థితుల్లో తెలుగు తేజం తిలక్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీతో మరోసారి జట్టును ఆదుకున్నాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. చివర్లో రవి బిష్ణోయ్(8 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో అకీల హొస్సెన్, అల్జారీ జోసెఫ్, రొమారియో షెఫెర్డ్ రెండేసి వికెట్లు తీసారు.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భారీ సిక్సర్తో దూకుడుగా ఆడిన శుభ్మన్ గిల్(7) మరుసటి బంతికే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. తెలివైన బంతితో అల్జారీ జోసెఫ్.. శుభ్మన్ గిల్ను బోల్తా కొట్టించాడు. ఈ వికెట్తో టీ20ల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(1).. కైల్ మేయర్స్ స్టన్నింగ్ త్రోకు వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి తిలక్ వర్మ రాగా.. ఇషాన్ ఓ బౌండరీ బాదాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 34 పరుగులే చేసింది.
అనంతరం తిలక్ వర్మ, ఇషాన్ కిషన్(27) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 42 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన ఈ జోడీని రొమారియో షెఫర్డ్ విడదీసాడు. అతని బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన ఇషాన్ కిషన్ మరుసటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఇషాన్ ఔటైనా.. తిలక్ వర్మ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే సంజూ శాంసన్(7) స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టంపౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు.
ఒబెడ్ మెక్కాయ్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన తిలక్ వర్మ.. అదే ఓవర్ చివరి బంతికి క్విక్ సింగిల్ తీసి 39 బంతుల్లో కెరీర్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. హార్దిక్ పాండ్యా కూడా ఓ భారీ సిక్సర్తో టచ్లోకి రాగా.. తిలక్ వర్మ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
అక్షర్ పటేల్ సాయంతో ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా(24)ను అల్జారీ జోసెఫ్ సూపర్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరి ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అక్షర్ పటేల్(14) కూడా క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అర్ష్దీప్ సింగ్ బౌండరీ బాదగా.. రవి బిష్ణోయ్ ఓ భారీ సిక్సర్ కొట్టడంతో టీమిండియా 150 పరుగుల మార్క్ అందుకుంది.