హైదరాబాద్: వెస్టిండీస్ పర్యటన వ్యక్తిగత రికార్డుల కోసం తప్పా జట్టుకు ఎందుకు ఉపయోగపడదని, ఈ టూర్కు యువ ఆటగాళ్లను పంపించి సీనియర్ ఆటగాళ్లతో వన్డే ప్రపంచకప్ సన్నాహకాలు ప్రారంభించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. గవాస్కర్ చెప్పినట్లే భారత ఆటగాళ్లు వ్యక్తిగత రికార్డులతో దుమ్మురేపారు. సెంచరీలు మోత మోగించారు.
వర్షం కారణంగా రెండు టెస్ట్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నారు. అయితే ఈ రెండు టెస్ట్ల సిరీస్ ద్వారా టీమిండియాకు ఒరిగింది ఏమైనా ఉందా? అంటే ఉన్నదనే చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ సిరీస్లో జట్టుకు అనేక సానుకూలంశాలు ఉన్నాయంటున్నారు.

యశస్వీ అరంగేట్రం:యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ కూడా సత్తా చాటాడు. దాంతో టీమిండియా ఓపెనింగ్ జోడీ సరికొత్త కాంబినేషన్ను తలపించింది. ముఖ్యంగా కొన్నేళ్లుగా టీమిండియాను వెంటాడుతున్న లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సమస్య ఈ సిరీస్తో తీరింది.
వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న జైస్వాల్ ఏకాగ్రత, వయసుకు మించిన పరిణతి చూపెట్టాడు. తొలి టెస్ట్లో 387 బంతులు ఆడిన అతను ఎలాంటి తప్పిదాలు చేయకుండా క్లీన్ షాట్లతో ఆకట్టుకున్నాడు. డిఫెన్స్ నుంచి ఎటాక్ వరకు అన్నింటా మెప్పించాడు.
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో మరో హాఫ్ సెంచరీ బాదిన అతను.. రెండో ఇన్నింగ్స్లో 30 బంతుల్లో 38 పరుగులు చేసి.. జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడగలనని చెప్పాడు. టెక్నిక్, టెంపర్మెంట్తో పాటు టీమ్ ప్లేయర్గా ఆడగలననే నమ్మకం కలిగించిన అతనికి మంచి ఫ్యూచర్ ఉంది.

రాణించిన ఇషాన్ కిషన్..:కారు ప్రమాదానికి గురై జట్టుకు దూరమైన రిషభ్ పంత్ స్థానాన్ని కేఎస్ భరత్ భర్తీ చేయకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ సిరీస్లో ఇషాన్ కిషన్కు అవకాశం ఇచ్చింది. యశస్వి మాదిరిగానే ఇషాన్ కిషన్ కూడా తొలి సిరీస్లోనే మెప్పించాడు. తన కీపింగ్ స్కిల్స్తో ఆకట్టుకున్న ఈ యువ కీపర్.. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో మెరుపు హాఫ్ సెంచరీతో రిషభ్ పంత్ను గుర్తు చేశాడు.
తన ఇదే జోరు కొనసాగిస్తే.. జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్గా కొనసాగనున్నాడు. ఈ ఏడాది చివర్లో సౌతాఫ్రికా పర్యటలో యువ ఆటగాళ్లకు కఠిన సవాల్ ఎదురవ్వనుంది. అన్రిచ్ నోర్జ్, రబాడ, ఎంగిడి లాంటి పేసర్లను ఎదుర్కొని నిలబడితే ఈ యువ ఆటగాళ్లకు తిరుగుండదు.
ముకేష్ అరంగేట్రం.. సిరాజ్ తడాఖా:దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడుతూ భారత జట్టు పిలుపును అందుకున్న ముకేష్ కుమార్ ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లోనే రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో పేస్ లేకున్నా పదునైన కట్టర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు.
ఇక బుమ్రా, షమీ గైర్హాజరీలతో పేస్ లీడర్గా వ్యవహరించిన సిరాజ్ వన్డేలతో పాటు రెడ్ బాల్లోనూ నంబర్ వన్ బౌలర్ను అయ్యే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు పడగొట్టిన సిరాజ్ ఈ ఫార్మాట్లో తొలిసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.