న్యూఢిల్లీ: వెస్టిండీస్ పర్యటనను ఓటమితో ముగించిన టీమిండియా.. పలు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన చివరి మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ గెలుపుతో వెస్టిండీస్ 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ సిరీస్ పరాజయంతో టీమిండియా తన ఖాతాలో అనవసరపు రికార్డులు వేసుకుంది.
గత 25 నెలల్లో టీమిండియా ఇదే తొలి దైపాక్షిక టీ20 సిరీస్ ఓటమి. 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓడిపోవడం ఇదే తొలిసారి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను కోల్పోవడం కూడా టీమిండియాకు ఇదే తొలిసారి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియాను ఓడించడం వెస్టిండీస్కు ఇదే మొదటిసారి.

హార్దిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా టీ20 సిరీస్ ఓడిపోవడం ఇదే ప్రథమం. గతంలో న్యూజిలాండ్, శ్రీలంకపై రెండు సార్లు, ఐర్లాండ్పై ఒకసారి హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా గెలుపొందింది.
ఆఖరి టీ20లో టీమిండియాను బ్యాటింగ్ వైఫల్యం దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 61), తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 27) మినహా అంతా విఫలమయ్యారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 18 ఓవర్లలోనే 2 వికెట్లకు 171 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. బ్రాండన్ కింగ్(55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 85 నాటౌట్), నికోలస్ పూరన్(35 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 47) రాణించారు. భారత బౌలర్లలో తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్ తలో వికెట్ తీసారు.