
ట్రినిడాడ్: వెస్టిండీస్ గడ్డపై శిఖర్ ధావన్ సారథ్యంలో వన్డే జట్టు దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచిన గబ్బర్ సేన 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకొని వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఓ దేశంపై అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్లు గెలిచిన జట్టుగా చరిత్రకెక్కింది. బుధవారంతో వన్డే సిరీస్ ముగియనుండగా.. శుక్రవారం టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. విశ్రాంతి పేరిట వన్డే సిరీస్కు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ టీ20ల్లో జట్టును నడిపించనున్నాడు. ఈ ఉదయమే రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్లతో కలిసి రోహిత్ విండీస్ గడ్డపై అడుగుపెట్టాడు.
ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం యూకేలోనే ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లు సోమవారం విండీస్ ఫ్లైట్ ఎక్కారు. ఈ విషయాన్ని వారే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక ఈ స్టార్ ఆటగాళ్లు విండీస్ చేరిన విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ ముగ్గురితో పాటు భారత్ నుంచి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్ కూడా జట్టుతో కలిసారు.
వీరికి టీమ్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్వాగతం పలికాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్న ఈ ఆటగాళ్లు.. రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. బుధవారం మూడో వన్డే ముగిసిన అనంతరం టీ20 సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లంతా అక్కడే ఉండనుండగా.. ఇతర ఆటగాళ్లు భారత్ రానున్నారు. ఈ టీ20 సిరీస్కు కేఎల్ రాహుల్ ఎంపికైనప్పటికీ.. అతను జట్టుతో కలిసే అవకాశాలు లేవు. హెర్నీయా ఆపరేషన్ తర్వాత ఫిట్నెస్ సాధించేందుకు బెంగళూరులోని ఎన్సీఏలో చేరిన రాహుల్ కరోనా బారిన పడ్డాడు. దాంతో అతను ఈ సిరీస్కు దూరమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే రాహుల్ స్థానంలో శుభ్మన్ గిల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
వెస్టిండీస్తో భారత టీ20 జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్