టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ చెత్త రికార్డ్ నమోదు చేశాడు. 13 ఏళ్ల తర్వాత ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి బ్యాటింగ్కు దిగిన తొలి కెప్టెన్గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. వెస్టిండీస్తో న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో గిల్ ఈ చెత్త ఫీట్ను నమోదు చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 518/5 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో టీమిండియాకు 270 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. వెంటనే వెస్టిండీస్ను ఫాలో ఆన్ ఆడించిన టీమిండియాకు ఆ జట్టు నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది.
తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్లు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు తీవ్రంగా అలసిపోయారు. రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాటర్లు ఔట్ చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా మారడంతో భారత బౌలర్ల కష్టాలు రెట్టింపు అయ్యాయి. జాన్ కాంప్బెల్(199 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 115), షైహోప్(214 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్లతో 103) సెంచరీలతో రాణించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 177 పరుగులు జోడించారు. కాంప్బెల్కు ఇదే తొలి టెస్ట్ సెంచరీ కాగా.. 8 ఏళ్ల తర్వాత షైహోప్ మరో శతకాన్ని అందుకున్నాడు.

ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్తో వెస్టిండీస్ ఈ మ్యాచ్లో టీమిండియా ఆధిక్యాన్ని అధిగమించి.. మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించి నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం ఇది ఐదోసారి మాత్రమే. ఇప్పటి వరకు మొత్తం 41 సార్లు ప్రత్యర్థిని ఫాలో ఆన్ ఆడించిన టీమిండియా.. నాలుగు సార్లు మాత్రమే నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు దిగింది.
చివరిసారిగా 2012లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఇంగ్లండ్తో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఫాలో ఆన్ ఆడించి నాలుగో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 1961లో నారి కాంట్రాక్టర్ సారథ్యంలో పాకిస్థాన్తో ఢిల్లీ వేదికగా తొలిసారి ఫాలో ఆన్ ఆడించి టీమిండియా బ్యాటింగ్కు దిగింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆ తర్వాత మహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో 1993లో ఇంగ్లండ్పై కోల్కతా వేదికగా ఫాలో ఆన్ ఆడించి బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్లతో గెలిచింది. మళ్లీ ఇన్నాళ్లకు శుభ్మన్ గిల్ సారథ్యంలో ఫాలో ఆన్ ఆడించి మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు సిద్దమవుతుంది. అయితే ఈ మ్యాచ్లో కూడా టీమిండియా గెలిచే అవకాశం ఉంది.
జాన్ కాంప్బెల్ను జడేజా ఔట్ చేస్తే.. షైహోప్ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, బుమ్రా నిప్పులు చెరిగి విండీస్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చారు. దాంతో నాలుగో రోజు టీ బ్రేక్ సమయానికి వెస్టిండీస్ 109 ఓవర్లలో 9 వికెట్లకు 361 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జైడెన్ సీల్స్(18 బ్యాటింగ్), జస్టిన్ గ్రీవ్స్(35 బ్యాటింగ్) ఉన్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ 91 పరుగుల ఆధిక్యంలో ఉంది.