ఫ్లోరిడా: భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో వెస్టిండీస్ 179 పరుగుల భారీ లక్ష్యం నమోదు చేసింది. షిమ్రాన్ హెట్మైర్(39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 61) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది.
అతనితో పాటు షైహోప్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్ తలో వికెట్ తీసారు. ఓ దశలో 160 పరుగులు కూడా చేసేలా కనిపించని విండీస్ను హెట్మైర్ ఆదుకున్నాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓ భారీ సిక్సర్తో పాటు రెండు బౌండరీలతో జోరు కనబర్చిన కైల్ మేయర్స్(7)ను అర్ష్దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. అతను వేసిన రెండో ఓవర్లోనే సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్తో కైల్ మేయర్స్ వెనుదిరిగాడు.
ఈ ఓవర్ నాలుగో బంతిని అర్ష్దీప్ సింగ్ షార్ట్ పిచ్ బాల్గా వేయగా.. మేయర్స్ కీపర్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సంజూ గాల్లోకి ఎగిరి అద్భుతంగా బంతిని అందుకున్నాడు.
క్రీజులోకి వచ్చిన షై హోప్ ధాటిగా ఆడగా.. మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్(18)ను అర్ష్దీప్ సింగ్ తన మరుసటి ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో బ్రాండన్ కింగ్ నిరాశగా వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలో వెస్టిండీస్ 2 వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది.
ఆ వెంటనే హార్దిక్ పాండ్యా తన ట్రంప్ కార్డ్ కుల్దీప్ యాదవ్ను బరిలోకి దించగా.. అతను ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. డేంజరస్ నికోలస్ పూరన్(1)తో పాటు కెప్టెన్ రోవమన్ పోవెల్(1) క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో వెస్టిండీస్ 57 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్మైర్తో షైహోప్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ ఐదో వికెట్కు 49 పరుగులు జోడించింది. క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేస్తున్న ఈ జోడీని యుజ్వేంద్ర చాహల్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన షై హోప్(45)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన రోమారియో షెఫర్డ్(9)ను అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. జాసన్ హోల్డర్(3) ముకేష్ కుమార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు షిమ్రాన్ హెట్మైర్ తనదైన బ్యాటింగ్తో పరుగులు రాబట్టాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన 18వ ఓవర్లో క్విక్ డబుల్తో 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
చివరి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన హెట్మైర్.. మరుసటి బంతికి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన అకీల హోస్సెన్ ఓ బౌండరీ బాదగా.. ఓడియన్ స్మిత్ భారీ సిక్సర్తో ఇన్నింగ్స్ను ముగించాడు.